సంచలన తీర్పు: ‘చెరుకులపాడు’ హత్య కేసులో డిప్యూటీ సీఎం కేఈ కుటుంబానికి బిగ్ షాక్!
కర్నూలు: వైఎస్సార్సీపీ నేత చెరుకులపాటు నారాయాణరెడ్డి హత్యకేసులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. ఈ కేసులో డిప్యూటీ సీఎం కుమారుడు కేఈ శ్యామ్బాబుతో సహా మరో ఇద్దరిని దోషులుగా చేర్చి, అరెస్టు చేయమంటూ డోన్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
నారాయణ రెడ్డి హత్య కేసులో ఆయన భార్య కంగాటి శ్రీదేవి కోర్టును ఆశ్రయించారు. తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ ఆమె తన వాదన వినిపించారు. తన భర్తతోపాటు మరో వ్యక్తిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్బాబు ఆయన అనుచరులు అతి కిరాతకంగా హత్య చేశారని తెలిపారు.
ఆ తరువాత వారు పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి చార్జిషీట్లో తమ పేర్లు తొలగించుకున్నారంటూ శ్రీదేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భర్త హత్యకేసులో నిందితులుగా కేఈ శ్యామ్బాబుతోపాటు ఆస్పరి జెడ్పీటీసీ సభ్యులు కప్పెట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్లను కూడా ముద్దాయిలుగా చేర్చాలంటూ ఆమె ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్బాబుతోపాటు ఆస్పరి జెడ్పీటీసీ సభ్యులు కప్పెట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్లను నిందితులుగా చేర్చి వారిని అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.