అక్కడే పరిచయం: యూట్యూబ్ వీడియోలు చూసి మర్డర్ ప్లాన్.. రమీజా హత్యలో నిజాలు..
డోన్: కర్నూలు జిల్లా డోన్ పరిధిలో ప్రియుడి చేతిలో హత్యకు గురైన రమీజా హత్య కేసులో పోలీసులు వివరాలు రాబట్టారు. నిందితుడు రషీద్ తో రమీజా పరిచయం.. వారిద్దరి మధ్య సంబంధం.. హత్యకు దారి తీసిన పరిస్థితులపై పూర్తి వివరాలను రాబట్టగలిగారు.
భర్త చనిపోయాక వివాహేతర సంబంధం: గర్భవతి అయ్యాక ప్రియుడి చేతిలో హత్య
హత్య చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్న రషీద్.. యూట్యూబ్ వీడియోలు చూసి మరీ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని పోలీసులు నిర్దారించారు. నిందితుడికి ఎవరెవరు సహకరించి ఉంటారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
రమీజా నేపథ్యం:
కొండపేటకు చెందిన రమీజాకు గతంలోనే వివాహమైంది. అయితే భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. ఆమెకు ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విడిపోయిన తర్వాత డోన్ లోని ఓ రెడీమెడ్ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది.
అక్కడే పరిచయం:
రమీజా పనిచేస్తున్న వస్త్ర దుకాణం రషీద్(20) బంధువులదే కావడంతో.. అతను తరుచూ అక్కడికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో రమీజాతో పరిచయం పెంచుకున్నాడు. రమీజా విడాకుల గురించి తెలుసుకుని.. ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. రషీద్ ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి పేరుతో మోసం:
రషీద్ వల్ల గర్భం దాల్చిన తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని రమీజా ఒత్తిడి చేయడం ప్రారంభించింది. రషీద్ మాత్రం తప్పించుకుని తిరుగుతూ వచ్చాడు. దీంతో మోసపోయానని గ్రహించిన రమీజా స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో పెళ్లి చేసుకుంటున్నానని ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని చెప్పడంతో రమీజా రాజీ పడింది. అయినా రషీద్ తీరులో మాత్రం మార్పు రాలేదు.
అటవీప్రాంతంలో బస్సు ఆపి:
తనను పెళ్లి చేసుకోవాలని రమీజా నుంచి ఒత్తిడి పెరగడంతో రషీద్ లో అసహనం పెరిగింది. ఆమెను లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. నవంబరు 20న నంద్యాలలో పెళ్లి చేసుకుందామంటూ నమ్మించి డోన్లో బేతంచెర్ల వెళ్లే బస్సులో ఆమెతో పాటు బయలుదేరాడు. ఆపై మార్గమధ్యలోనే ఓ అటవీ ప్రాంతంలో ఆమెతో పాటు బస్సు దిగాడు. వెనకాల తమ వాహనం వస్తుందని, అందులో వెళ్తామని బస్సు కండక్టర్కు చెప్పడంతో అతను అక్కడే బస్సు నిలిపాడు.
ప్లాన్ ప్రకారమే హత్య:
రైల్వే వంతెన సమీపంలో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమె గొంతు వెనుక నుంచి నైలాన్ తాడుతో బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ముందస్తు పథకంలో భాగంగా నాలుగు రోజుల కిందటే ఆ ప్రాంతంలో ఓ గుంత తవ్వి పెట్టాడు. హత్యానంతరం మృతదేహాన్ని తాను తవ్విన గుంతలో పూడ్చిపెట్టాడు. హత్య స్థలంలో పోలీసులకు నైలాన్ తాడు, మృతురాలి దుస్తులు, గొయ్యి తవ్వే పరికరాలు దొరికాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత కర్నూలు న్యాయస్థానానికి తరలించారు.