సీనియర్లకు షాక్: భూమా పదవికి బుగ్గనను ఎంపిక చేసిన వైయస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవికి కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఎంపిక చేశారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీ సీనియర్లు జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, అమరనాథరెడ్డిలు షాక్కు గురయ్యారు.
మరోవైపు పీఏసీలో సభ్యులుగా ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజాలను నియమించారు. సోమవారం ఉదయం లోటస్ పాండ్లో జరిగిన వైసీఎల్పీ భేటీలో వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో పీఏసీ ఛైర్మన్ పదవి ప్రధాన ప్రతిక్షానికి ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది.
ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన భూమా నాగిరెడ్డిని ఆ పదవిలో నియమించింది. అయితే ఇటీవల టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా భూమా నాగిరెడ్డి, తన కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి ఇటీవల టీడీపీలో చేరిపోయారు.
తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందు పీఏసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో పీఏసీ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. ఈ పదవి కోసం జ్యోతుల నెహ్రూతో పాటు చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దరెడ్డి రాంచంద్రారెడ్డి, అదే జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డిలు తమవంతు యత్నాలు చేశారు.
అయితే చివరకు వైయస్ జగన్ మాత్రం డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందే రాజకీయ ప్రవేశం చేసిన బుగ్గన తొలి ప్రయత్నంలోనే డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు పీఏసీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు.
ఇదిలా ఉంటే వైయస్ జగన్ అధ్యక్షతన సోమవారం లోటస్ పాండ్లో వైసీఎల్పీ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవించకుండా తామే సుప్రీం అన్న ధోరణిలో ముందుకుపోతుందని విమర్శించారు.
సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రే బూతులు మాట్లాడిన స్పీకర్, సభా హక్కుల కమిటీ పట్టించుకోలేదని వారు వాపోయారు. సాయంత్రం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. రోజా వ్యవహారంలో కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.
ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రోజా సస్పెన్షన్ వ్యవహారంలో అనుసరించాల్సిన విధానంపై వైసీఎల్పీలో చర్చించారు. కాగా మార్చి 24 గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభక బీఏసీ సెలవు ప్రకటించింది.