జగన్! మీలా అన్ని కార్డులు మాకు లేవు! కేసీఆర్ సలహా ఏంటి?: ధూళిపాళ్ల విమర్శలు
అమరావతి: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ నేతల విమర్శల దాడులు కొనసాగుతున్నాయి. కుల రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మా అమ్మాయి తెల్ల రేషన్ కార్డా?
తాడేపల్లి, కాజ, నంబూరులో ఏ సామాజిక వర్గాలున్నాయని ఆయన నిలదీశారు. తన అమ్మాయికి తెల్లరేషన్ కార్డు ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారని ధూళిపాళ్ల మండిపడ్డారు. జైలు కార్డులు, బినామీ కార్డులు ఉన్నది జగన్మోహన్ రెడ్డికేనని ఆయన ఎద్దేవా చేశారు.
తాడేపల్లి నివాసం, లోటస్ పాండ్ జగన్ పేరు మీదే ఉన్నాయా?
తాడేపల్లిలోని జగన్ ఇల్లు కూడా ఆయన పేరు మీద లేదని అన్న ధూళిపాళ్ల.. లోటస్పాండ్లోని ఇల్లు జగన్ పేరు మీద ఉందా? అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జాతి పక్షులన్నీ ఒక చోటుకు చేరాయని అన్నారు. ప్రభుత్వంలో పనిచేసే అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు.
జగన్కు కేసీఆర్ సలహా ఇచ్చారా?
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు ఇచ్చారని చెబుతున్నారని.. హైదరాబాద్లోని పాలనా భవనాలను ఉత్తర, దక్షిణ తెలంగాణకు విభజిస్తారా? అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చారని.. ఇప్పుడు హోదా అంశాన్ని పక్కన పెట్టింది మీరు కాదా? అని నిలదీశారు. జగన్ చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.
అందుకు జగన్ ఏమైనా చేస్తారు..
కండిషన్ బెయిల్పై ఉన్న విజయసాయి రెడ్డి లేఖలు ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. ఎంపీ హోదాను విజయసాయి రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సీబీఐ కోర్టు, సుప్రీంకోర్టు, ఈడీకి తామే లేఖలు రాస్తామని ధూళిపాళ్ల తెలిపారు.
అరచేతిలో వైకుంఠం చేసే పని రేపు కూడా చేస్తారని విమర్శించారు. రాజధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి తాయిలాలు ప్రకటిస్తారని అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ ఏమైనా చేస్తారని ధ్వజమెత్తారు. జగన్ సర్కారు ఆరు నెలల కాలంలోనే రూ. 35వేల కోట్ల అప్పులు చేసిందని అన్నారు.