తప్పక న్యాయం చేస్తా: ధూళిపాళ్లకు చంద్రబాబు హామీ, లోకేష్ సూచన మేరకే..
మంత్రి పదవి దక్కక నిరాశలో కూరుకుపోయిన గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు భవిష్యత్లో న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.
అమరావతి: అంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ అనంతరం మంత్రి పదవులురాని పలువురు సీనియర్ నేతలు తెలుగుదేశం అధిష్టానంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తే, మరికొందరు అలిగివెళ్లిపోయారు. ఇలాంటి నేతలను ఇప్పుడు టీడీపీ అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది.
మంత్రి పదవి దక్కక నిరాశలో కూరుకుపోయిన గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు భవిష్యత్లో న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు గురువారం నరేంద్ర.. సీఎంను కలిశారు.
సామాజిక సమీకరణల్లో భాగంగా మంత్రి వర్గంలో చోటు కల్పించలేకపోయామని నరేంద్రకు మరోమారు స్పష్టం చేశారు చంద్రబాబు. కాగా, ఏపీ మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కకపోవడంతో పలువురు టీడీపీ నేతలు నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఉన్నారు.
అయితే, కొత్తగా మంత్రి బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్ను అభింనందించే నిమిత్తం నరేంద్ర ఇటీవల ఆయన్ని కలిశారు. సీఎం చంద్రబాబును కలవాలని ఆయనకు లోకేశ్ సూచించడం జరిగింది. ఈ క్రమంలోనే ధూళిపాళ్ల సీఎంను కలవగా.. తప్పక న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
నమ్మకాన్ని నిలబెడతా: పరిటాల
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై నమ్మం ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. గురువారం ఆమె అమరావతిలో మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... చాలా ప్రాధాన్యం కలిగిన శాఖను తనకు ముఖ్యమంత్రి అప్పగించారని సునీత అన్నారు. మహిళా, శిశు సంక్షేమానికి పాటుపడతానని ఆమె అన్నారు.