‘మోడీ గీతలోనే పవన్, జగన్-ఏపీపై చిన్నచూపు: విజయసాయిని ఉరితీయాలి’
అమరావతి: భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
Recommended Video
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బుధవారం పట్టిసీమపై చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా ఉన్నాయన్నారు. డెల్టా రైతుల్ని అవమానపరిచే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని అన్నారు.
డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుందన్న ఆందోళనలతోనే చంద్రబాబు గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా తీసుకొచ్చారని ధూళిపాళ్ల చెప్పారు. పట్టిసీమ నుంచి డెల్టా ప్రాంతానికి ఇప్పటిదాకా 115 టీఎంసీల నీరు అందించినట్లు తెలిపారు.
మాట మార్చిన విష్ణు.. అసలు కారణాలేంటి?
పట్టిసీమ వల్ల పంటలు పండుతుంటే.. ఇప్పుడు బీజేపీ సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయాలని డిమాండ్ చేయడం వెనుక ఉన్న కారణాలేంటో చెప్పాలని నరేంద్ర డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పట్టిసీమ అద్భుతమని చెప్పిన విష్ణకుమార్ రాజు.. ఇప్పుడు ఎందుకు మాట మార్చారని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.
మోడీ చిన్న చూపు
ఇది ఇలావుండగా, టీడీపీ యువ నేత అవినాశ్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రధాని మోడీ చేసిన అన్యాయాన్ని ప్రజలు మరిచిపోరని అన్నారు. రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తూ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారని విమర్శించారు.
మోడీ గీతలోనే పవన్, జగన్
ప్రధాని గీసిన గీతలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని అవినాశ్ ఆరోపించారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సీఎం చంద్రబాబు సిద్ధమని, హోదా సాధించే వరకు ఉద్యమం ఆగదని అవినాశ్ స్పష్టం చేశారు. గురువారం ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రామవరప్పాడు రింగ్ రోడ్డు దగ్గర చేపట్టిన నిరసనల్లో అవినాష్ పాల్గొన్నారు.
విజయసాయిని ఉరి తీయాలి
జగన్, విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన విజయసాయిరెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరుడైన విజయసాయికి ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అలాగే జగన్ అవినీతికి నాయకుడంటూ విమర్శించారు. తమ నాయకుడు చంద్రబాబు అలుపెరుగని ప్రజా నాయకుడు అంటూ చెప్పుకొచ్చారు. అక్రమ కేసుల నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు..