సిగ్గులేకుండా..బఫూన్ మాదిరిగా: సభలో సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు: వేర్వేరుగా ఎస్సీ..ఎస్టీ కమిషన్లు..!
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ..ఎస్టీ కమిషన్ ను..ఇక నుండి వేర్వేరుగా ఎస్సీ కమిషన్..ఎస్టీ కమిషన్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును సభలో ప్రతిపాదించే ఆమోదించే సమయంలో.. ప్రతిపక్ష నేత చంద్రబాబు..ముఖ్యమంత్రి తో సహా వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎస్సీల సంక్షేమం టీడీపీతో నే జరిగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దళితుల సంక్షేమం విషయంలో గుడ్డొచ్చి.. పిల్లను ఎక్కిరించినట్లుగా ఉందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దీనికి మంత్రులు..ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలోని వారి కుటుంబం నిర్వహించే ఆలయంలో కి ఇప్పటికీ దళితులకు ప్రవేశం లేదని డిప్యూటీ సీఎం నారాయాణ స్వామి చెప్పుకొచ్చారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతపైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మొత్తం రాష్ట్రంలో 36 రిజర్వ్ సీట్లు ఉంటే అందులో కేవలం ఒక్క సీటు మాత్రమే టీడీపీ గెలిచిందని వివరించారు. సిగ్గు లేకుండా..బఫూన్ మాదిరిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
సిగ్గు లేకుండా నవ్వుతున్న చంద్రబాబును..
ముఖ్యమంత్రి జగన్..ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని ప్రశ్నించిన చంద్రబాబు..ఎస్సీలు..ఎస్టీలను మోసం చేసారని ఫైర్ అయ్యారు. ప్రతీ విషయంలోనూ దళితులు..బీసీలు..మైనార్టీల పట్ల వివక్ష చూపించారని విమర్శించారు. ఓట్ల కోసం కులాలే కాదు..అన్న దమ్ములను చీల్చేస్తారని ఆరోపించారు. చంద్రబాబు ఎస్సీ..ఎస్టీ ద్రోహి అంటూ మండిపడ్డారు.
ఎస్సీ..ఎస్టీ సమస్యల పరిష్కారం కోసమే వేర్వేరుగా కమిషన్లు తీసుకొస్తున్నామని మఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇటువంటి వ్యక్తి ఉండటం ప్రతిపక్ష నేతగా ఉండటం నేరమన్నారు. తమ ప్రభుత్వం లో ఎస్సీ..ఎస్టీ..మైనార్టీలకు ఇస్తున్న ప్రాధాన్యత చూసైన చంద్రబాబు నేర్చుకోవాలని సూచించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు..ప్రతీ గుడిలోనూ ఎస్సీ..ఎస్టీ..బీసీలే ఛైర్మన్లుగా ఉండే విధంగా చూస్తున్నామన్నారు. అసలు..సిగ్గు లేకుండా..బఫూన్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాజధానిలో అసైన్డ్ భూముల విషయంలో అన్యాయం చేసారంటూ లెక్కలు చెప్పుకొచ్చారు.
ఎస్సీల సంక్షేమానికి టీడీపీ పోరాటం చేస్తుంది..
ఎస్సీ సంక్షేమానికి టీడీపీ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది..వారి కోసం పోరాటం చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించారు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లుగా వైసీపీ తీరు ఉందన్నారు. తాను అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించి..నోటీసు ఇస్తే పారిపోయిన ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. ఎస్సీ విద్యార్ధులను న్యాయం చేసింది టీడీపీనే అని చెప్పుకొచ్చారు. తమ హాయంలో..ఎస్సీ ఎస్టీల సంక్షే మానికి 10 వేల కోట్ల ఖర్చు చేసామన్నారు.
కేఆర్ నారాయణన్ కు రాష్ట్రపతి పదవి ఇవ్వటంలో కీలకంగా వ్యవహరించామని చెప్పుకొచ్చారు. లోక్ సభలో స్పీకర్ గా బాలయోగి..ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిభా భారతిని నియమించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. సీఎస్ గా దళిత వర్గానికి చెందిన కాకి మాధవరావుకు అవకాశం ఇచ్చామన్నారు. జగన్ కావాలని సభ్యులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దిశ చట్టం తీసుకొచ్చిన రోజునే గుంటూరు లో ఒక విద్యార్ధిని పైన జరిగిన దాడి గురించి చంద్రబాబు ప్రస్తావించారు.
మాల..మాదిగ వర్గాలుగా చీల్చారు..
చంద్రబాబు వ్యాఖ్యల పైన డిప్యూటీ సీఎం నారాయాణ స్వామి స్పందించారు. మాల మాదిగలుగా ఎస్సీలను చీల్చింది చంద్రబాబు అంటూ మండిపడ్డారు. నారావారి పల్లెలో వారి గుడిలో ఇప్పటికీ దళితులకు ప్రవేశం లేదని చెప్పుకొచ్చారు. మరో మంత్రి కన్నబాబు సైతం జోక్యం చేసుకున్నారు. దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు అనలేదా అని నిలదీసారు.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సభలో ఎస్సీ..ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లు పైన చర్చ సమయంలో చంద్రబాబు గైర్హాజరయ్యారని దుయ్యబట్టారు. ఏనాడైనా చంద్రబాబు రుషితేశ్వరి అంశం లేవనెత్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తాను నిర్వహించిన దొంగ దీక్షలకు ఎస్సీ సంక్షేమ నిధులను వినియోగించారని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే సుధాకర్ బాబు గతంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి..విప్ చింతమనేని ఇద్దరూ దళితుల మీద కించ పరిచే వ్యాఖ్యలు చేస్తే..చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆ తరువాత సభలో ఈ బిల్లును ఆమోదించారు.