డైలాగ్ వార్: జగన్ వర్సెస్ చంద్రబాబు: కాళేశ్వరం పైన క్లారిటీ: అనుభవం అంత లేదు మీ వయసు..!
ఏపీ శాసన సభా సమావేశాల తొలి రోజునే ముఖ్యమంత్రి జగన్..ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య హోరా హోరీగా మాటల యుద్దం సాగింది. కేసీఆర్తో సంబంధాలు..కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కావటం పైన సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రాజెక్టు నిర్మిస్తుంటే ఏం చేసారని నిలదీ సారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటే మీకు బాధ ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు సైతం ఘాటు గానే స్పందించారు. ముఖ్యమంత్రి గారు..నా అనుభవం అంత లేదు మీ వయసు అంటూ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల అంశం పైన ఇద్దరి మధ్య ఆసక్తి కర చర్చ సాగింది.
జగన్తో సంబంధాలు..కాళేశ్వరం పైన...
సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి అనిల్ పోలవరం ప్రాజెక్టు గురించి వివరించారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు జగన్ ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసారు. ఇప్పుడు సీఎం అయిన తరువాత ప్రారంభోత్సవానికి ఎలా వెళ్లారనే ప్రశ్నకు జగన్ స్పందించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసారని..అయిదేళ్ల పాటు ఆ ప్రాజెక్టు కడుతుంటే ఏపీకి అన్యాయం అయితే ఎందుకు ఆపే ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుండి 524 మీటర్లకు పెంచు కుంటూ పోతుంటే అప్పుడు చక్రం తిప్పుతున్న చంద్రబాబు ఏం చేసారని జగన్ నిలదీసారు. కేసీఆర్తో సత్సంబంధా లతో ముందుకు వెళ్తున్నామని..కాళేశ్వరం ప్రాజెక్టు తాను వెళ్లినా..వెళ్లకున్నా ఆరంభం అవుతుందని పేర్కొన్నారు. నీటి వివాదాల పైన కోర్టుకు వెళ్తే పరిష్కారం లభించవని..ఇద్దరి మధ్య సయోద్యతోనే ఉపయోగం ఉంటుందన్నారు. కేసీఆర్ తమ భూభాగం నుండి కృష్ణా ఆయుకట్లుకు నీరు వచ్చేలా అంగీకరించి..ముందుకు వచ్చినందుకు అభినందిం చాలని జగన్ పేర్కొన్నారు.
జగన్..నా అనునభవం అంత మీ వయసు లేదు..
ముఖ్యమంత్రి ప్రసంగం పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. ముఖ్యమంత్రి అన్నీ తనకే తెలుసని భావిస్తు న్నారని..ముఖ్యమంత్రి గారు.. నా అనుభవం అంత లేదు మీ వయసు అని వ్యాఖ్యానించారు. దీనికి వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా చంద్రబాబు సీరియస్ అయ్యారు. జగన్..కేసీఆర్ మధ్య ఒప్పందం భావి తరాలకు నష్టం జరిగేలా ఉండకూడదని.. దీని పైన చర్చ జరిపి ఆమోదం తీసుకోవాలని సూచించారు. ఇప్పుడే ముఖ్యమంత్రి ఈ అంశం పైన మాట్లాడుతారని అనుకోలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ ఒప్పందం ఇద్దరు కలిసి ఉన్న సమయంలో బాగానే ఉంటుందని..ఆ ఇద్దరూ పదవులు వీడితే తరువాత ఇది అమలవుతుందని నమ్మకం ఏంటని ప్రశ్నించారు. దీనికి కొనసాగింపు ప్రాతిపదిక ఏంటని నిలదీసారు. ముఖ్యమంత్రి చేసిన స్టేట్మెంట్ చాలా సున్నితమైదని.. తొందర పడవద్దు..భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
40 ఏళ్ల అనుభవం అంటారు..ఇదేనా మీ పరిజ్ఞానం..
ముఖ్యమంత్రి స్పందిస్తూ..40 ఏళ్ల అనుభవం అంటారు..ఇదేనా మీ పరిజ్ఞానం అంటూ ప్రశ్నించారు. ఇది ఇద్దరి వ్యక్తుల మద్య ఒప్పందం కాదని..రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగ్రిమెంట్ అని స్పష్టం చేసారు. తెలంగాణ భూ భాగం నుండి నీటిని మనకు ఇవ్వటానికి కేసీఆర్ ముందకు వచ్చారని చెప్పుకొచ్చారు. అదే విధంగా ప్రస్తుతం సాగర్ .. శ్రీశైలం ప్రాజెక్టులు రెండు ప్రభుత్వాల పర్యవేక్షణలోనే ఉన్నాయని..అదే విధంగా భవిష్యత్లో కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మరి ఇన్ని మాట్లాడే వ్యక్తి రాష్ట్ర విభజన సమయంలో వీటి పైన ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. సోనియా గాంధీని చూసి భయపడ్డారా అని ముఖ్యమంత్రి నిలదీసారు. హరికృష్ణ భౌతిక ఖాయం వద్ద రాజకీయ పొత్తులు పెట్టుకోవటానికి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. కేంద్ర మా ఇద్దరినీ కలవనీయలేదంటూ కేసీఆర్ తో సంబంధాల గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జగన్ గుర్తు చేసారు.