ఏపీలో కరోనా:ఆ ప్రధానికి వైరస్ సోకిందని.. దేశానికి ఉపప్రధానిగా జగన్.. అసలేం జరుగుతోంది?
దేశంలో మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తోపాటు పొలిటికల్ వార్ కూడా పెరిగిపెద్దవుతోంది. బుధవారంనాటికి రాష్ట్రంలో మరో ఇద్దరు కొవిడ్-19 పేషెంట్లు కన్నుమూశారు. దీంతో మరణాల సంఖ్య 11కు చేరింది. కేసుల సంఖ్య 502కు పెరిగింది. వైరస్ నియంత్రణ చర్యల్లో సీఎం జగన్ ఫెయిలయ్యారని ఆరోపిస్తోన్న ప్రతిపక్ష టీడీపీ.. ఇప్పుడు 'చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ కాల్'అంశాన్ని కూడా బాగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై అధికార వైసీపీ కూడా ఎదురుదాడి చేస్తున్నది. ఆక్రమంలో ఎక్కడలేని అంశాలన్నీ ప్రస్తావనకు వస్తుండటంతో అసలేం జరుగుతోందనే కన్ఫ్యూజన్ సర్వత్రా వ్యక్తమవుతోంది.
లాక్డౌన్2.0 ప్రకటించిన కాసేపటికే..
కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలను సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశానని, ఆ తర్వాత మోదీనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారాని, పరిపాలనా అనుభవం దృష్ట్యా వైరస్ నియంత్రణకు సలహాలివ్వాల్సిందిగా కోరారని టీడీపీ చీఫ్ చంద్రబాబు వెల్లడించడం తెలిసిందే. ప్రధాని మోదీ లాక్ డౌన్ పొడగింపు ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే చంద్రబాబు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఆ విధంగా కీలక సమయంలో చంద్రబాబు తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మొత్తం వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయి అనుమానాలు వ్యక్తం చేశారు. పలు రకాలుగా బాబును ఎద్దేవా చేశారు.
లేకపోతే బతకనివ్వడు..
మోదీకి నచ్చచెప్పి, అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబెట్లు పంపిది.. ఆర్మీని రంగంలోకి దించకపోతే కరోనాతో చనిపోతారని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ను హెచ్చరించింది.. ఆఖరికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు వైరస్ సోకిన విషయాన్ని డాక్టర్లకు తెలియపర్చింది కూడా ‘ఆయనే' అని.. ప్రపంచంలో ప్రతి కొత్త ఆలోచన వెనుక ‘ఆయన'అనబడే చంద్రబాబే ఉంటాడని, ఇదే విషయాన్ని ప్రజలంతా గుర్తించని పక్షంలో ఆయన ఎవరినీ బతకనీయబోడు.. అంటూ ఎంపీ విజయసాయి.. టీడీపీ చీఫ్ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ప్రధాని ఫోన్ చేసిన విషయాన్ని కూడా ప్రచారానికి వాడుకోవడాన్ని తప్పుపట్టారు.
పాతికసార్లు ప్రాధేయపడితే..
ప్రపంచంలో జరిగేవన్నీ తన వల్లేనని చంద్రబాబు నమ్ముతారని, గతంలో పెద్ద నోట్ల రద్దు సలహా ఇచ్చింది కూడా తానేనని డప్పుకొట్టుకున్నారని, ఆ విషయంలో క్రెడిట్ కొట్టేయాలని చంద్రబాబు ప్రయత్నించినా, ప్రధాని మోదీ మాత్రం హుందాతనంతో చూసి వదిలేశారని విజయసాయి తెలిపారు. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనూ టీడీపీ చీఫ్ వైఖరి మారలేదని, మూడు జోన్ల పద్ధతి ప్రవేశ పెట్టాలని తానే లేఖరాసినట్లు బాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎంపీ అన్నారు. ‘‘పాతికసార్లు ప్రాధేయపడి ఉంటే ఫోన్ వచ్చుండొచ్చు. అదికూడా ఉదయం కాల్ వస్తే.. కనీసం 4 గంటలు కూడా ఓపిక పట్టలేక మీడియాకు వెళ్లగక్కాడు. మరి మోదీకి రాసిన లేఖ విషయం ఇన్నాళ్లు ఎందుకు దాచాడు? దీన్ని బట్టే అది బోగస్ క్లెయిమ్ అని తెలుస్తూనే ఉందిగా''అని మండిపడ్డారు.
అది మోదీ వినమ్రత..
చంద్రబాబు ఒక్కరికే మోదీ ఫోన్ చేశారన్న స్థాయిలో ప్రచారం జరుగుతుండటం హాస్యాస్పదంగా ఉందని విజయసాయి అన్నారు. నిజానికి కరోనా వ్యాప్తి తర్వాత ప్రధాని వీలైనప్పుడల్లా పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, నర్సులతోపాటు, వైరస్ నుంచి కోలుకున్నవాళ్లందరికీ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని, అది ఆయన వినమ్రతను తెలియజేస్తున్నదని అన్నారు. పైగా, మోదీకి మెమరీ పవర్ ఎక్కువని, గతంలో చంద్రబాబు.. ‘మోదీ గో బ్యాక్'అని ఫ్లెక్సీలు కట్టించడం, ప్రధాని వ్యక్తిగత విషయాలపై నీచంగా మాట్లాడిన సంగతిని మర్చిపోలేరని ఎంపీ గుర్తుచేశారు.
Recommended Video
బుద్దా బ్లాసింగ్ కామెంట్స్..
ప్రధాని మోదీ.. చంద్రబాబుకు ఫోన్ చేసిన విషయంలో వైసీపీ నేతలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ప్రధానంగా సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిని ఉద్దేశించి ఆయన బ్లాస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘విజయసాయి బట్టలు ఎందుకు చించుకుంటున్నారో అర్థంకావట్లేదు. ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ వైసీపీ ఊరేగింది. ఫ్రంట్ గెలిస్తే.. వైఎస్ జగన్ దేశానికి ఉప ప్రధాని అవుతారంటూ మీరిచ్చిన బిల్డప్ మరిచిపోయారా? ఎంపీలను గెలిపిస్తే మోదీ మెడలు వంచుతామని.. ఇప్పుడేమో మోదీ కాళ్ల మీద పడిపోయిన సంగతి గుర్తులేకుంటే ఎలా?''అని వెంకన్న ఫైరయ్యారు. తద్వారా, ఇప్పటికే కరోనాపై సాగుతోన్న రాజకీయాలకు మోదీ ఫోన్ కాల్ వ్యవహారం మరింత ఆజ్యంపోసినట్లయింది.