వంశీ బెంగుళూరులో జగన్ను కలిసారు: నా జోలికి వస్తే చూస్తూ కూర్చోను: వంశీ వర్సెస్ వెంకట్రావు
ఎన్నికల పోలింగ్..ఫలితాల మధ్య ఏపిలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడిన టీడీపీ అభ్యర్ది వల్లభనేని వంశీ..వైసీపీ అభ్యర్ది యార్లగడ్డ వెంకట్రావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వెంకట్రావు ఇంటికి వంశీ రావటం..వెంకట్రావుకు సన్మానం చేస్తామని చెప్పటం..ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది. తాజాగా, వంశీ లేఖ..ఆయన చేసిన ట్వీట్..వెంకట్రావు రియాక్షన్ కలిసి ఇక ఈ అంశం మరింత ఉత్కంఠ కలిగిస్తోంది.
వంశీ లేఖ..కొనసాగుతున్న టెన్షన్..
ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయినా రాజకీయంగా మాత్రం ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. గన్నవరం నియోజకవర్గం నుండి పోటీలో ఉన్న టీడీపీ ..వైసీపీ అభ్యర్దులు వల్లభనేని వంశీ..యార్లగడ్డ వెంకట్రావు మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. వల్లభనేని వంశీ తనను సన్మానం చేస్తానంటున్నారని..తన ఇంటికి వచ్చి వెళ్లారంటూ విజయవాడ నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసారు. వంశీ నుండి తనకు ప్రాణహానీ ఉందని యార్లగడ్డ వెంకట్రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని వంశీ బహిరంగా లేఖ రాసారు. యార్లగడ్డ వెంకట్రావుతో మాట్లాడాలనే తాను ఆయన ఇంటికి వెళ్లానంటూ వంశీ తన లేఖలో పేర్కొన్నారు. దీని పైన వంశీ తాను మర్యాద పూర్వకంగా కలిసేందుకే రమ్మంటున్నానంటూ ఓ ట్వీట్ చేసారు. తన ఇంటిలో కలవటానికి అభ్యంతరం ఉంటే..తన ఇంటికి వెంకట్రావు వచ్చి కాఫీ తీసుకొని మాట్లాడుకోవటానికి రావాలని ఆహ్వానించారు.
బెంగుళూరులో జగన్ను కలిసారు..
వంశీ..తన మధ్య జరుగుతున్న వ్యవహారం పైన వైసీపీ అభ్యర్ది వెంకట్రావు స్పందించారు. వంశీ లాగా తాను దిగజారి మాట్లాడే వ్యక్తిని కాదని చెప్పుకొచ్చారు. వంశీ ఒక సందర్భంలో జగన్ గన్నవరం వస్తే ఆయన్ను వాటేసుకున్నారని గుర్తు చేసారు. తన భార్యతో సహా బెంగుళూరు వెళ్లి జగన్ను వంశీ కలవలేదా అని వెంకట్రావు ప్రశ్నించారు. తాను ఇసుక దోచుకొని అక్రమ సంపాదనకు పాల్పడలేదని..తాను సొంతంగా సంపాదించిన సొమ్ముతో రాజకీయం చేస్తున్నానని వివరించారు. ఎన్నికల్లో ఓడిపోతున్నాడనే నిస్పృహతోనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని వెంకట్రావు చెప్పుకొచ్చారు. గతంలోనూ వంశీ రెండు సార్లు తనతో మాట్లాడారని..వంశీ లాగా తాను దిగజారి మాట్లాడే వ్యక్తిని కాదని వివరించారు. వంశీ లాగా తాను మట్టి..చెరువులు అమ్ముకోవటానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు.
నా జోలికి వస్తే చూస్తూ ఊరుకోను..
వంశీ పైన వెంకట్రావు మాట్లాడుతూ ఆయన లాగా తాను ఏనాడు వ్యవహరించలేదని చెప్పుకొచ్చారు. జై రమేష్ సోదరులను వంశీ ఇష్టానుసారం మాట్లాడారని ఆరోపించారు. దౌర్జాన్యాలు చేసారని..సామాన్యుల పైనా చేయి చేసుకున్నాడంటూ వంశీ పైన విమర్శలు గుప్పించారు. తగాదాకు తాను వెళ్లబోనని,అయితే తమ కిందకు నీళ్లు వస్తే సహించబోనని ఆయన అన్నారు. వంశీ ఇష్టం వచ్చినట్లు భాష వాడుతూ రాజకీయాలను దిగజార్చారని ఆయన అన్నారు. జగన్ అదికారంలోకి వస్తున్నారన్న భయంతో వంశీ ఏమేమో చే్స్తున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైన పోలీసులు సైతం దృష్టి సారించారు.