ఇక వజ్రాల అనంతపూర్..! పునఃప్రారంభం కానున్న వజ్ర కరూర్ డైమండ్ ప్లాంట్..!!
అనంతపురం/హైదరాబాద్ : ఇక మన అనంతపురం వజ్రాల అనంతపురం కానుంది. అనంతపురం జిల్లా వజ్రకరూరులోని వజ్రాల ప్రక్రమణ కర్మాగారం డైమండ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లో పనులు పునఃప్రారంభం కానున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ కేంద్రంలో వజ్రాన్వేషణ పనులు నిలిపివేసిన విషయం విదితమే. తాజాగా వజ్రాల ప్రక్రమణ కర్మాగారంలో పనులు మొదలుకానున్నాయి. జిల్లాలోని వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లో వజ్రాల గనులు ఉన్నట్లు గుర్తించిన అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం వజ్రకరూరు గ్రామంలో భారతీయ భూవైజ్ఞానిక సర్వేక్షణ ఆధ్వర్యంలో వజ్రాల ప్రక్రమణ కర్మాగారాన్ని ఏర్పాటుచేసింది.
అప్పటి నుండి వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లో జియాలజిస్టులు సర్వేలు నిర్వహించి వజ్రాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి మట్టిని సేకరించారు. దాన్ని వజ్రకరూరులోని కర్మాగారానికి తరలించి వజ్రాన్వేషణ సాగించారు. అయితే గత కొంత కాలంగా వజ్రాన్వేషణ పనులు తాత్కలికంగా నిలిపివేశారు.కాగా ఆరుమాసాల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీధరన్ వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లో విలువైన వజ్ర నిక్షేపాలు, బంగారు గనులు ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో తిరిగి వజ్రాన్వేషణ పనులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. రెండు సంవత్సరాల క్రితం కూడేరు మండలం శివరామ్పేట సమీపంలో గల పొలాల్లో జీఎస్ఐ అధికారులు సర్వేలు నిర్వహించి అక్కడ వజ్ర నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.
శివరామ్పేట సమీపంలో గల పొలాల్లో దాదాపు 500 టన్నుల మట్టితో వజ్రాన్వేషణ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే అప్పట్లో కేవలం వందటన్నుల మట్టిని మాత్రమే సేకరించి పనులు నిర్వహించారు. తిరిగి రెండేళ్ల అనంతరం అదే గ్రామ శివారు ప్రాంతంలో మరో 300 టన్నుల మట్టిని సేకరించి, వజ్రాన్వేషణ కేంద్రానికి తరలించారు. ఆ మట్టిని ప్రోసెసింగ్ చేసేందుకు కర్మాగారంలో ఉన్న యంత్రాలకు మరమ్మతులు చేపడుతున్నారు. త్వరలో వజ్రకరూరులో గల వజ్రాల ప్రక్రమణ కర్మాగారంలో పనులు ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. సేకరించిన మట్టిలో విలువైన వజ్రాలు ఆశాజనకంగా లభ్యమైతే తిరిగి మట్టి సేకరణ పనులు జరిగే అవకాశం ఉంది.