గుంటూరులో 10కి చేరిన అతిసార మృతుల సంఖ్య...ఆందోళన
గుంటూరు: గుంటూరు నగరంలో అతిసారం అమాయక ప్రజల పాలిట యమపాశం లా మారింది. గడచిన మూడు రోజుల్లో ఈ వ్యాధి బారిన పడి 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గత రెండ్రోజుల్లో 7గురు మరణించగా...ఇవాళ మరో ముగ్గురు మృత్యువాత పడినట్లు చెబుతున్నారు. కలరాతో జీజీహెచ్ లో చికిత్స పొందుతూ బాలాజీ నగర్కు చెందిన వెంకటరావు, సంగడిగుంటకు చెందిన పద్మావతి మృతి చెందారు. అమరావతి సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జియాఉద్దీన్ నగర్కు చెందిన చిన బాలకోటిరెడ్డి, గుడివాడ వారి వీధికి చెందిన సామ్రాజ్యం అనే వృద్దురాలు మృత్యువాతన పడ్డారు.
మరోవైపు ఒక్క గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 100కు పైగా ఉండగా, నగరవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో, మెడికల్ క్యాంపుల్లో మరో 600 మంది వరకు చికిత్స పొందినట్లు, పొందుతున్నట్లు తెలిసింది. బుధవారం జిల్లాకు చెందిన మంత్రులు, కలెక్టర్ జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అలాగే అతిసారం బారిన పడి మృతిచెందిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
మంత్రుల సందర్శన...మరో వైపు ఆందోళన
గుంటూరు నగరంలో కలుషిత నీరు త్రాగి మరణించిన వారి సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనున్నదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి శ్రీ పుల్లారావు, రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి శ్రీ నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టరు శ్రీ కోన శశిధర్ పరామర్శించారు. ఆసుపత్రి వైద్య అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వారు ఆసుపత్రి పర్యవేక్షకులు డా. రాజు నాయుడును ఆదేశించారు. మరోవైపు అతిసార బాధితులను పరామర్శించేందుకు జీజీహెచ్కు వచ్చిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మేకా ఆనందబాబులకు చుక్కెదురైంది. జనం ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదంటూ మంత్రులపై మండిపడ్డ జనం...ఆస్పత్రి ప్రధాన ధ్వారం వద్ద బైఠాయింపునకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలు అప్పిరెడ్డి, గులామ్, రసైల్లు ఆందోళనకు నేతృత్వం వహించారు. మంత్రుల రాక సందర్భంగా జీజీహెచ్ వద్ద భారీగా పోలీసులను మోహరించడం గమనార్హం.
ప్రభుత్వ సాయం...చర్యలు
అనంతరం మీడియాతో మంత్రి శ్రీ పుల్లారావు మాట్లాడుతూ జరిగిన సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి పది సంవత్సరాల వయస్సు పైబడి చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు వంతున, చిన్న పిల్లలు అయిన పక్షంలో వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు వంతున ఎక్స్ గ్రేషియా మంజూరు చేసినట్లు తెలిపారు. జరిగిన సంఘటనపై విచారణ నిర్వహించిన అనంతరం, అందిన నివేదిక ఆధారంగా మానవ తప్పిదం వున్నట్లు రుజువైతే అందుకు బాధ్యులైన వారిపై కటిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేసారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో 98 మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో అత్యవసర సేవలు అవసరమని గుర్తించిన పది మందిని మరింత మెరుగైన వైద్యం కోసం కార్పోరేట్ ఆసుపత్రికి తరలించనున్నామని, వారికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి పుల్లారావు స్పష్టం చేసారు. సమస్య మరింత జటిలం కాకూడదనే ఆలోచనతో మునిసిపల్ కొళాయిల ద్వారా నీటి సరఫరాను నిలిపివేసి, టాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
మరో మంత్రి ఆనందబాబు...పరామర్శ
అనంతరం మంత్రి శ్రీ ఆనందబాబు మాట్లాడుతూ నగరంలోని పాతబస్తీ ప్రాంతమైన ఆనందపేట, సంగడిగుంట, తదితర ప్రాంతాలలో పూర్వకాలం నాటి పైపు లైన్స్ వున్న దృష్ట్యా వాటి ద్వారా నీరు కలుషితం అయ్యే ప్రమాదం వుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫాతిమా, పద్మావతి, వెంకట్రావులు మరణించినట్లు మంత్రి తెలియజేసారు. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆనందబాబు స్పష్టం చేసారు.
జిల్లా కలెక్టర్...వివరణ...
జిల్లా కలెక్టరు శ్రీ శశిధర్ మాట్లాడుతూ ప్రధానంగా 6 వార్డులలో కలుషిత నీటి వలన అధికంగా విరోచనాలు అయినట్లుగా గుర్తించడం జరిగిందని అన్నారు. ఎక్కువగా ఆనందపేట, సంగడిగుంట ప్రాంతాలలో కేసులు నమోదు అయ్యాయని ఆయన చెప్పారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా పరిసర వార్డులను కూడా కలిపి మొత్తం పది వార్డులలో ప్రతి ఇంటికి సిబ్బందిని పంపి కాచి చల్లార్చిన నీటిని త్రాగాలనే విషయాన్ని తెలియజేస్తున్నామని చెప్పారు. అలాగే ప్రతి వార్డుకు ఒక్కొక్క వైద్య శిబిరాన్ని వ్యాధి తీవ్రత తగ్గే వరకు కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. ఇప్పటి వరకు 640 మంది వైద్య శిబిరాలకు వచ్చి చికిత్స చేయించుకున్నారని, వారిలో సుమారు 450 మందిని చికిత్స అనంతరం వారి ఇండ్లకు పంపడం జరిగిందని చెప్పారు. గురువారంకు పరిస్థితి అందుబాటులోకి రాగలదని భావిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.