గుంటూరులో ఆగని అతిసార మరణాలు...15 కి చేరిన మృతుల సంఖ్య
గుంటూరు: గుంటూరులో అతిసారం మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. నగర పాలక సంస్థ పరిధిలో కలుషిత నీరు తాగి మృతిచెందిన వారి సంఖ్య గురువారం నాటికి 15కి చేరింది. గుంటూరు జిజిహెచ్ లో డయేరియాకు చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోవడం కలకలం రేపింది. కొత్తపేటకు చెందిన గంగాభవానీ, పీవీ తోటకు చెందిన నూకరాజు, బీఎస్ నగర్కు చెందిన బుర్రయ్య ఈ తెల్లవారుజామున మృతిచెందారు.
ఈ ముగ్గురిలో గంగాభవానీ, నూకరాజును తొలుత రమేశ్ ఆసుపత్రి నుంచి బుధవారం సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే వీరు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
జిజిహెచ్ లో ఇప్పటికీ అతిసార సమస్యతో సుమారు 100మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన వారు కాగా...పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వారు కూడా కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. అతిసార సమస్యతో కొత్తగా ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ...మరోవైపు మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుండటం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.