చారిత్రక ఘట్టం: దున్నిన బాబు, ధాన్యాలు చల్లిన భార్య, రాజధాని ప్రాంతంలో చిరుజల్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టం. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం గం.8.49 నిమిషాలకు రాజధాని కోసం భూమి పూజ చేశారు. భూమిపూజలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా తెల్లని పంచె, మెడలో ఎరుపురంగు కండువా ధరించిన చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి భూమిపూజ ప్రారంభించారు. బొడ్రాయికి శంఖుస్థాపన చేశారు.
పూజ కోసం తీసిన గుంతలోకి దిగిన చంద్రబాబు దంపతులు అక్కడ నవధాన్యాలు, బంగారం తదితరాలు ఉంచారు. బంగారు తాపి, వెండి గమేళాలు వాడి, ఇటుకల మధ్య సిమెంట్ వేయడం ద్వారా లాంఛనాన్ని పూర్తి చేశారు. వేదపండితులు ఆయనతో ఈ క్రతువు చేయించారు.
కార్యక్రమంలో నారా లోకేష్, కోడెల శివప్రసాద్, గంటా శ్రీనివాస రావు, గల్లా జయదేవ్, మాగంటి బాబు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా, భూమిపూజ ప్రాంతంలో చిరుజల్లులు కురిశాయి.
కేంద్రం సాయంపై అనుమానం వద్దు: నిర్మలా సీతారామన్
రాజధాని భూమిపూజ సమయంలో చిరుజల్లులు శుభసూచకమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుందన్నారు. రాష్ట్రానికి సాయం పైన ఎలాంటి అనుమానం అక్కర లేదని చెప్పారు. భూమిపూజ సమయంలో చంద్రబాబు నాగలి దున్నారు. భార్య భువనేశ్వరి నాగటిచాలులో నవధాన్యాలు చల్లారు.