ఎమ్మెల్యే కిలారిని సన్నిహితులే పట్టించారా?...ఔనంటున్నారు:పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
విశాఖపట్నం:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చి సరిగ్గా వారం అయింది. దాడి జరిగిన గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు విచారణలో పోలీసులు ఏం తెలుసుకున్నారు?...ఈ కేసు విషయంలో ఏం పురోగతి సాధించారు?...ఈ ప్రశ్నలు ఉత్పన్నమవడం సహజం!
కిడారి పెద్ద కుమారుడికే అరకు ఎమ్మెల్యే సీటు?...అదే సిఎం అభిమతం:అలా తెలిసిందంటున్నారు!
అనూహ్యంగా విరుచుకుపడిన మావోయిస్టులు ఒకే దాడిలో ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేని హతమార్చడంతో ఖంగుతిన్న పోలీసులు...ఒకవైపు తమ వైఫల్యాన్ని ఒప్పుకుంటూనే మరోవైపు ఈ దాడి సమగ్ర విచారణకు చమటోడుస్తున్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే కిడారికి బాగా సన్నిహితులైన వ్యక్తులే ఆయన కదలికలు ఎప్పటికప్పుడు మావోయిస్టులకు తెలిపినట్లు పోలీసుల విచారణ తేలిందట. ఆ ఇద్దరు అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 23...!మావోయిస్టులు విశాఖ మన్యంలో విరుచుకుపడి అరకు ఎమ్మెల్యే కిడారి,మాజీ ఎమ్మెల్యే సోమ ను దారుణంగా కాల్చిచంపిన రోజు...ఆ ఘటన జరిగి వారం గడిచింది. ఈ ఘటన చోటుచేసుకోవడం వెనుక పోలీసుల ఘోరవైఫల్యం ఉందని అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో డిజిపి కి దాడికి బాధ్యత తమదేనని అంగీకరించారు. ఈ క్రమంలో తీవ్రంగా దెబ్బతిన్న తమ ప్రతిష్టను వీలైనంత త్వరగా తిరిగి కొంతయినా దక్కించుకునేందుకు పోలీస్ శాఖ మావోయిస్టుల దాడిపై శల్య పరీక్ష జరిపే తీరులో సమగ్ర విచారణ చేపట్టింది.
ఈ నేపథ్యంలో తాము జరిపిన విచారణలో ఎమ్మెల్యే కిడారి,మాజీ ఎమ్మెల్యే సోమ హత్యల సూత్రధారులు, పాత్రధారులతో పాటు సహకారుల పై కూడా పోలీసులు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమకు లభించిన సమాచారం మేరకు పోలీసులు శనివారం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. వీరిద్దరు కిడారికి బాగా సన్నిహితులు కావడమే ఇందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం.
ఎమ్మెల్యే కదలికలను ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేస్తూ ఆయనను ఈ ఉచ్చులో చిక్కుకునేలా చేసింది వీరేనని పోలీసుల విచారణలో తేలిందట. వారి కాల్డేటా ఆధారంగా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారని తెలిసింది. దీంతో వీరిద్దరిని తమ అదుపులోకి తీసుకున్న పోలీసుల వీరినుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసు శాఖలో అత్యంత సమర్థులైన అధికారులను విచారణకు వినియోగించడంతో పాటు స్వయంగా డిజిపినే వారిని విచారించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు లిపిటిపుట్టులో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కాల్చివేత తరువాత మావోయిస్టులు ఆ పరిసరాల్లోనే రెండు రోజులు షెల్టర్ తీసుకున్న విషయం పోలీసులు ఇప్పటికే నిర్థారించిన సంగతి తెలిసిందే. అలాగే విచారణ మరింత లోతుగా జరుపుతున్న కొద్దీ దాడికి పాల్పడిన మావోలు ఇప్పటికీ తమ అసలు స్థావరాలకు చేరుకోలేదని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారు నేటికీ మన్యం పరిధిలోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లోనే తలదాచుకొని ఉన్నారని, ఆ గ్రామాలను సైతం గుర్తించిన ఎపి పోలీసులు...ఒడిశా పోలీసులతో కలిసి ఆయా గ్రామాలపై దాడులకు సమాయత్తమవుతున్నారు.
ఈ క్రమంలో మావోల నుంచి ఏ స్థాయి ప్రతిఘటన ఎదురైనా అందుకు ధీటుగా బదులివ్వాలని, మావోలపై సరైన ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదల పోలీసుల్లో కనిపిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై డీజీపీ ఠాకూర్ తీవ్రంగా కలత చెందుతున్న విషయం పోలీసులతో శుక్రవారం నాటి భేటీలో వారందరూ గమనించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సమా వేశంలో విశాఖ ఎస్పీ రాహుల్దేవ్శర్మని డీజీపీ తీవ్రంగా తప్పుబట్టారని తెలిసింది.
మావోయిస్టుల 'అరకు' దాడి జరగడానికి కొన్ని రోజుల ముందే తనను కలిసిన విశాఖ ఎస్పీ శర్మ మాటమాత్రంగానైనా మావోల ఉనికి గురించి ప్రస్తావించకపోవడాన్ని గుర్తుచేసి మరీ కడిగేశారట. అలాగే డీఐజీ శ్రీకాంత్ పనితీరుపైనా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని...హత్యాకాండ తరువాత స్థానికులు పోలీస్ స్టేషన్లపై దాడి చేస్తుంటే మీరు సకాలంలో సరైన చర్యలు తీసుకోకుండా చూస్తూ ఎలా ఉండగలిగారని డిజిపి ఠాకూర్ నిలదీశారని తెలిసింది. ఏదేమైనా అతి త్వరలోనే మావోయిస్టులపై భీకర ప్రతి దాడికి ఎపి పోలీసులు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.