జగన్ కోరిందే ప్రధాని చేశారా..? ఏపీకి కొత్త ఊరట..మారుతున్న రాజకీయ సమీకరణాలు
ఏపీ ముఖ్యమంత్రి కోరుకున్నదే ప్రధాని చేస్తున్నారా..? జగన్ వాదనతో మోడీ ఏకీభవించడం వెనక కారణం ఏంటి..? తాజాగా మోడీ ప్రసంగం విన్న తర్వాత ప్రతిపక్షాలకు ఇది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. వీడియో కాన్ఫరెన్స్లో గతంలోనూ తాజాగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించిన అంశాలకు ప్రధాని దాదాపు ఓకే చేశారు.
రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనలకు పరిగణలోకి తీసుకుంటామని ప్రధాని స్పష్టం చేశారు. ప్రత్యేకించి 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ద్వారా జగన్ కోరిన విధంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని ప్రకటించడం జగన్ అండ్ కోకు ఊరట కలిగిస్తోంది. అదే విధంగా కరోనాతో పోరాడుతూనే ముందుకు సాగుతూ ప్రధాని వ్యాఖ్యానించడం కూడా పరోక్షంగా జగన్కు బలాన్ని పెంచుతోంది.
జగన్ అవమానించలేదు, నేనే దిగిపోయా.. సిగ్గు శరం లేకుండా మోకరిల్లారు.. ఎల్జీ పాలిమర్స్లో విజయసాయి..
వీడియో కాన్ఫరెన్స్లో జగన్ సూచనలు
తాజాగా ప్రధాని జాతినుద్దేశించి చేసిన ప్రసంగం రూ.20 లక్షల కోట ఆర్థిక ప్యాకేజీ ఆయన ప్రస్తావించిన అంశాలు ప్రత్యేకించి వైసీపీలో కొత్త చర్చకు కారణమయ్యాయి. అంతకుముందు రోజు ప్రధానితో జరిగిన ముఖ్యమంత్రుల సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్లో ఏపీ సీఎం జగన్ పలు అంశాలను ప్రస్తావించారు. చిన్న మధ్య తరహా పారిశ్రామిక రంగాలకు అండగా నిలవాలని వాటి రుణాలపైన వడ్డీ మాఫీ చేయాలని కోరారు. తయారీ , రీటైల్ రంగాలకు ప్రోత్సాహకం ఇవ్వాలని కోరారు. కరోనా పైన అవగాహన కల్పిస్తూ ప్రజల్లో మానసికంగా ధైర్యం కల్పించేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని జగన్ సూచించారు.
కరోనాను ఎదుర్కొంటూనే ముందుకు సాగాల్సిన విషయాలను జగన్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపైన ఫోకస్ చేయాలని కేంద్రం సహకరించాలని అభ్యర్థించారు. జగన్ వ్యాఖ్యలపైన రాజకీయంగా విమర్శలు వచ్చినా ప్రధాని ప్రసంగం తర్వాత జగన్ వాదనతో కేంద్రం సైతం కొంతమేరా ఏకీభవిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రధాని నోట అదే మాట...
జాతినుద్దేశించి ప్రసంగించిన సమయంలో కరోనా గురించి ఆందోళన చెందకుండా ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రధాని మోడీ ప్రాధాన్యత ఇచ్చారు. అటు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అండగా నిలబడతామని చెప్పారు. లాక్డౌన్ విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 17 తర్వాత లాక్డౌన్ 4 కొనసాగుతుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే కొత్త మార్పులు ఉంటాయని మాత్రం స్పష్టం చేశారు. ఏపీ సీఎం సైతం కరోనా కారణంగా సాధారణ ప్రజల రోజువారీ జీవనంపైన ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ప్రధానిని అభ్యర్థించారు.
నాలుగో విడత లాక్డౌన్లో పెద్ద ఎత్తున మినహాయింపులతో లాక్డౌన్ కొనసాగుతుందనే విషయం స్పష్టం అవుతోంది. ప్రధాని ప్రకటించిన భారీ ప్యాకేజీ ద్వారా రాష్ట్రాల వారీగా చూసుకున్న ఏపీకి భారీ మొత్తంలో నిధులు వస్తాయనే అంచనాలు ప్రభుత్వంలో మొదలయ్యాయి. అతలాకుతలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చేలా వివిధ వర్గాలకు చెందిన వారికి ప్రధాని ప్యాకేజ్ మేలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు లెక్కలుకడుతున్నాయి.
జగన్కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ప్రశంస
ఇక ఇదే సమయంలో ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ముఖ్యమంత్రి జగన్ను అభినందించారు. ఆయన చేస్తున్న సూచనలను ఏపీలో పెద్ద ఎత్తున సాగుతున్న కరోనా టెస్టులు ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో కేంద్రం పెద్దల వద్ద జగన్ ఇమేజ్ పెరుగుతోందంటూ వైసీపీ నేతలు చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం రాజకీయ విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రధాని ప్రకటించిన ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరాలతో వెల్లడించిన తర్వాత ఏపీ ప్రభుత్వ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయనేది స్పష్టత వచ్చే అవకాశఉంది.