టిట్లీ తుఫాన్ నష్టంపై తెలుగు మెయిన్ మీడియా చిన్న చూపు చూసిందా?...అందుకేనా ఆ ఘటన!
Recommended Video
శ్రీకాకుళం:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా శ్రీకాకుళంలో బస చేస్తూ టిట్లీ తుఫాన్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తుండటంతో ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయనే విధంగా తెలుగు మెయిన్ మీడియాలో వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
అయితే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం శ్రీకాకుళంలో టిట్లీ తుఫాన్ భారీ ఎత్తున విధ్వంసం సృష్టించిందని...వేలాదిమంది ప్రజలు కనీస సాయం అందక అల్లాడుతున్నారని ఫోటోలతో సహా వార్తలు, కథనాలు కనిపించాయి. అయితే మెయిన్ మీడియాలో టిట్లీ భీభత్సం గురించి కంటే సిఎం రమేష్ నివాసంపై ఐటి దాడుల గురించే ప్రధానంగా వార్తల కవరేజీ రావడం వల్ల శ్రీకాకుళంలో నష్టం విషయం అప్రధాన్య అంశంలాగా వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో శ్రీకాకుళంలో తుఫాన్ బాధితులు సిఎం కాన్వాయ్ నే చుట్టుముట్టి నిలిపివేయడంతో అక్కడ పరిస్థితి తీవ్రత అందరికీ అర్థం అయింది.
మెయిన్ మీడియా ముఖ్యంగా తెలుగు మీడియా తమ ప్రధాన కార్యమైన ప్రజా ప్రయోజనాల గురించి పట్టించుకునే అంశానికి అంతకంతకూ దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోందని సామాజిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఉదాహరణలు కోకొల్లలుగా చెప్పొచ్చని, ఇప్పటిప్పుడు చెప్పాలంటే టిట్లీ తుఫాన్ విషయంలో మెయిన్ మీడియా వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనమని అంటున్నారు.
ఈ మూడే లక్ష్యంగా
తెలుగు మీడియా అయితే గ్లామర్ లేకుంటే రాజకీయ ప్రయోజనాలు...ఈ రెండు కాదనుకుంటే సంస్థల ఆర్థిక ప్రయోజనాలు ఈ మూడే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ...అసలు ప్రజా ప్రయోజనాలు అనే తమ ప్రధాన విధి నుంచి నిర్మొహమాటంగా తప్పుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అమ్మాయిలు...అందునా అందమైన అమ్మాయిలకు సంబంధించిన వార్తలంటే...విస్తృత సామాజిక ప్రయోజనాలు అటుంచి కనీస జన సమూహాలపై ప్రభావం చూపే అవకాశం లేకున్నా...కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత ఘటనలకు తమ విలువైన అత్యధిక సమయాన్ని వెచ్చిస్తున్నాయని వారు వాపోతున్నారు.
శ్రీకాకుళంలో దారుణమైన పరిస్థితులు
తిత్లీ తుఫాన్ దెబ్బకు ఉత్తరాంధ్రలో అనేక ప్రాంతాలు అతలాకుతలం కాగా...శ్రీకాకుళంలో దారుణమైన పరిస్థితులు నెలకొని ఉంటే...ఉద్దానం ప్రాంతం అస్తవ్యస్తం అయిపోతే...ప్రభుత్వ వర్గాలు సహాయక చర్యలు జోరుగా సాగుతున్నట్లు...బాధితులకు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సాయం అందుతున్నట్లు సమాచారం ఇవ్వగా...మీడియా సైతం అందులో నిజాలు నిర్ధారించుకోకుండా అవే లెక్కలను వల్లె వేసింది. కానీ వాస్తవంగా 50 శాతం మందికి కనీసం మంచి నీళ్ళు కూడా అందలేదని, 60శాతం మందికి ఆహారం లభించనేలేదని హాహాకారాలు మిన్నంటాయి. వేలాది గ్రామాలు చీకట్లో మగ్గిపోతున్న విషయాన్ని విన్నవించుకున్నాయి.
మీడియాలో వస్తున్న వార్తల్లో
ఆ అసంతృప్తే ఏకంగా వారిని సిఎం కాన్వాయ్ కే అడ్డుకొల్పేందుకు పురికొల్పింది. తద్వారా మీడియాలో వస్తున్న వార్తల్లో నిజమెంతో...అక్కడ అసలు పరిస్థితి ఏమిటో జనాలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బాధితులకు మూడు పూటలా భోజనం ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పునరావాస కేంద్రాలు ఏర్పాటు
ఆదివారం సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించి తుపాను బాధితులందరికీ నిత్యావసర సరుకులు సరఫరా చేయాలన్నారు. అలాగే ఇళ్లు కోల్పోయిన వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేగాక గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, పొలాల్లో పడిపోయిన కొబ్బరిచెట్లు తొలగించే పనులు నిర్వహించాలని ఆదేశించారు.