నిజంగా కాంగ్రెస్ నుంచి వైసీపికి పిలుపు వచ్చిందా..? అయితే తగ్గేది జగనా..లేక కాంగ్రెస్సా..??
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇది నిజమా అంటే.. చంద్రబాబు. ఏడాది క్రితం రాహుల్గాంధీతో దోస్తీ చేయటమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు అదే దారిలో వైసీపీ అధినేత జగన్ కూడా అడుగులు వేయబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపి, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా తమ సొంతగా మెజార్టీ సాధించే పరిస్థితులు కనిపించట్లేదు. నిన్నటి వరకూ ఏ మూలనో ఉన్న ఆశలు క్రమంగా ఆడియాశలు అవుతువస్తున్నాయి. దీంతో ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి జాతీయ పార్టీలు.
రాజకీయాల్లో ఎవిరికి ఎవరూ శత్రువులు,మిత్రలు కారు..! సమయం ప్రకారం అంతా ఒకటే..!!
ఈ నేపథ్యంలోనే బీజేపీ తనకు పాత మిత్రులు చాలా అవసరమనే కోణంలో పావులు కదుపుతోంది. అమిత్షా, గడ్కరీ అండ్ బ్యాచ్ ఏపీలోని చంద్రబాబు, తెలంగాణలో చంద్రశేఖర్ రావుతోనూ మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో బీజేపీలోకి టీడీపీకి తలుపులు మూసుకుపోయినట్లే అని చెప్పిన అమిత్షా కూడా, అవకాశం ఉంటే.. ఇరువైపుల ప్రయోజనం ఉందని భావిస్తే ఎవరైనా రావచ్చంటూ మిత్రపక్షాలకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.
రాజకీయాల్లో గెలుపే ముఖ్యం..! అదికారమే పరమావది..!!
ఇటువంటి సమయంలోనే కాంగ్రెస్ కూడా తమకు అనుకూలమైన ప్రాంతీయపార్టీలు, నాయకుల జాబితాను సిద్ధం చేసుకుంటుందట. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి అధికశాతం ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలు చెప్పటంతో కాంగ్రెస్లోని వైఎస్ అనుచరులు కొందరు జగన్తో మంతనాలకు రెడీ అయ్యారట. ఈ మేరకు విజయసాయిరెడ్డి ద్వారా జగన్కు ఒక సందేశం కూడా పంపినట్లు తెలుస్తుంది. అయితే జగన్ మాత్రం.. ఫలితాల అనంతరం తమ నిర్ణయాలను చెబుతామని సున్నితంగా వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
గెలుపే అందరిని కలుపుతుంది..! ఓటమి ఒంటరిని చేస్తుంది..!!
అయితే.. 2009 తరువాత చోటుచేసుకున్న పరిణామాల్లో వైఎస్ మరణం.. అనంతరం జగన్ను సీఎం చేయాలని సంతకాల సేకరణం.. కాంగ్రెస్ను ధిక్కరించి జగన్ ఏకంగా ప్రాంతీయపార్టీ పెట్టడం అన్నీ జరిగాయి. దీన్ని దిక్కారంగా భావించిన కాంగ్రెస్ జగన్ అక్రమాస్తులపై సీబీఐను రంగంలోకి దింపింది. దీంతో లక్ష కోట్ల అవినీతి ముద్రను జగన్పై రుద్దారు. 16 నెలల పాటు జైలు జీవితం గడపాల్సిన దుస్థితిని జగన్కు కల్పించారు. దీంతో కాంగ్రెస్ అంటేనే తీవ్రంగా వ్యతిరేకించేతంగా వైసీపీ శ్రేణులు మారాయి.
ఫలితాల తర్వాత రాజకీయ పార్టీల భవిత..! ఎవరు ఎవరికి సన్నిహితులో చూడాలి..!!
ఇటువంటి విపత్కర సమయంలో జగన్ నిర్ణయం కీలకం కానుంది. టీడీపీ అధినేత కమలం వైపు అడుగులు వేస్తే.. తాము కీలకం అవుతామనేది వైసీపీ నేతల అంతరంగం. మరి రాజకీయాల్లో పాతకక్షలను మనసులో పెట్టుకుని జగన్ స్పందిస్తారా.. రాష్ట్ర ప్రయోజనాలకు.. తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం చేస్తారా! అనేది ఉత్కంఠతగా మారింది. అయితే.. ఈ తరహా మంతనాలు.. వైసీపీ, కాంగ్రెస్ మధ్య జరగటం వల్లనే చంద్రబాబు మరో కూటమిఅంటూ హడావుడి చేస్తున్నారనే ఊహాగానాలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.