ఎన్నికల్లో టీడీపీ ఓటమి భరించలేక వీరాభిమాని మృతి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని తట్టుకోలేకపోయిన ఓ వీరాభిమాని ప్రాణాలు విడిచాడు . చంద్రబాబు అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఆ అభిమాని చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మాడు. పార్టీ ఓటమి చెందటంతో ఆ కార్యకర్త పార్టీ ఓటమిని తట్టుకోలేక ఒత్తిడికి గురయ్యాడు. రెండ్రోజుల పాటు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడి చివరికి తుదిశ్వాస విడిచాడు.
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు గ్రామానికి చెందిన పీతా మధుసూదనరావు(53) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.మధుసూదనరావుకు భార్య మీనాక్షి, ఇద్దరు కుమార్తెలు శ్రీలేఖ, అలేఖ్య ఉన్నారు. పెద్దమ్మాయి బీఫార్మసీ, రెండో కుమార్తె డిగ్రీ చదువుతున్నారు మధుసూదనరావుకు చంద్రబాబంటే ఎనలేని అభిమానం. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున, చంద్రబాబు విజయం కోసం ప్రచారం కూడా చేశాడు.
అయితే మే 23న వెలువడిన ఫలితాల్లో టీడీపీ ఓటమి పాలయ్యింది. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యాడు. ఆ రోజు రాత్రి భోజనం కూడా చేయకుండా పడుకున్నాడు. మరుసటి రోజు ఛాతిలో నొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పగా మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మరణించాడు.
మధుసూదనరావు మరణవార్త తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మధుసూదనరావు ఇద్దరు ఆడపిల్లలు చదువు పూర్తి చేయడానికి, కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవడానికి టీడీపీ నాయకులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.