ఎపిలో డీజిల్ స్మగ్లింగ్...గుట్టురట్టు చేసిన డిఆర్ఐ:రూ.2 కోట్ల ఇంధనం స్వాధీనం
కాకినాడ:ప్రభుత్వం కళ్లు కప్పి అవినీతి అధికారుల అండదండలతో యథేచ్చగా సాగిపోతున్న భారీ డీజిల్ స్మగ్లింగ్ రాకెట్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు ఎపి ఇంటిలిజన్స్ విభాగం సహకారంతో ఛేధించారు.
కఠినమైన నిబంధనలను తోసిరాజని కస్టమ్స్ అధికారుల చేయూతతో విదేశాల నుంచి తమిళనాడు మీదుగా తెలుగు రాష్ట్రాల వరకు కొనసాగుతున్న ఈ ఇంధన దందాను ఎట్టకేలకు డిఆర్ఐ అధికారులు గుర్తించి గుట్టు రట్టు చేశారు. ఈ క్రమంలో అక్రమంగా నిల్వ ఉంచిన 3 లక్షల 10 వేల లీటర్ల డీజిల్ ను అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు 2 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనావేశారు.
గుట్టు...ఎలా బైటపడిందంటే?
ఆ డీజిల్ స్మగ్లింగ్ తో సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య విభేదాల కారణంగా ఈ ఇంధన అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ముందుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ అధికారులకు ఉప్పందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దందా తీరుపై ఒక అవగాహనకు వచ్చిన డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ హైదరాబాద్, చెన్త్నె విభాగాలు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఈ ఇంధన దందా దుబాయ్ నుంచి తమిళనాడు మీదుగా తెలుగు రాష్ట్రాల వరకు విస్తరించి వున్నట్లు కనుగొన్నారు. నిబంధనలు ఉల్లఘించి మినరల్ స్పిరిట్ పేరుతో దుబాయ్ నుంచి డీజిల్ ను అక్రమంగా దేశంలోకి తీసుకొస్తున్నట్లు తెలిసింది.
దందా...ఎలా జరుగుతుందంటే?...
నిబంధనల ప్రకారం డీజిల్ ను ప్రైవేట్ వ్యక్తులు దిగుమతి చేసుకోవడానికి అవకాశం లేదు, విదేశీ వాణిజ్య విధానం ఒప్పందం ప్రకారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే డీజిల్ దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంది. అయితే మినరల్ స్పిరిట్ పేరుతో కొందరు వ్యక్తులు డీజిల్ను దుబాయ్ నుంచి చెన్త్నె పోర్టులో దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడయింది. ఆ తరువాత ఆ డీజిల్ ను చెన్నై నుంచి ఒంగోలు, కాకినాడలతో పాటు తెలంగాణా తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. అలా తరలించిన డీజిల్ ను మార్కెట్ ధర కంటే రూ.10 నుంచి రూ.15 తక్కువకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం.
ప్రధానంగా...చేపల బోట్లకు వినియోగం...
ఈ డీజిల్ ను ప్రధానంగా కాకినాడ తో పాటుగా వివిధ తీరప్రాంతాల్లోని చేపల బోట్ల కోసం విక్రయిస్తునట్టు తెలుస్తోంది. ఈ డీజిల్ స్మగ్లింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్న తమిళనాడుకు చెందిన వ్యక్తిని కాకినాడలో అరెస్ట్ చేసిన అధికారులు ఆ తరువాత అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఈ దందాతో సంబంధం ఉన్న సాప్ పెట్రోలియం, ఆదిత్య మెరైన్ ల్యాండెడ్ తదితర కంపెనీలపై కేసులు నమోదు చేశారు. అనంతరం అక్రమంగా దాచివుంచిన 3లక్షల 10వేల లీటర్ల డీజిల్ను గుర్తించి సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా.
యథేచ్చగా దందా...కస్టమ్స్,పోలీసుల సహకారం
అయితే ఈ దందా చాలాకాలంగా సాగుతోందని డిఆర్ఐ అధికారుల విచారణలో వెల్లడయింది. దుబాయ్ నుంచి చెన్త్నె పోర్టుకి ఇప్పటివరకు 285 కంటైనర్ల ద్వారా సుమారు 63 లక్షల లీటర్ల డీజిల్ని అక్రమంగా దిగుమతి చేసినట్లు తెలుస్తోంది. ఇలా అక్రమంగా దిగుమతి చేసిన డీజిల్ విలువ రూ 18 కోట్లు వరకు ఉండొచ్చని డిఆర్ఐ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇంతకాలంగా దుబాయ్ నుంచి చెన్త్నెకి డీజిల్ దిగుమతి జరుగుతున్నా కస్టమ్స్ అధికారులు కనిపెట్టలేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఏళ్ల తరబడి నుంచి చెన్త్నె నుంచి డీజిల్ తెస్తూ కాకినాడలో విక్రయాలు జరుపుతున్నా ఈ విషయం పోలీసుల దృష్టికి రాకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడలో ఇటీవలే వెలుగు చూసిన వంట నూనె దందాను పోలీసులు లాలూచీ పడి నీరుగార్చారనే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో డీజిల్ స్మగ్లింగ్ గురించి కూడా అక్కడి పోలీసులకు ముందే తెలుసనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.