"చంద్రబాబుది 'స్టే' మంత్రం.. వైఎస్ ది విచారణ ఎదుర్కొనే తత్వం"
హైదరాబాద్ : ఓటుకు నోటు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న అంశం. నిన్నటిదాకా చర్చల్లో నానిన ఈ అంశం.. ఏపీ సీఎం చంద్రబాబు స్టే తెచ్చేసుకోవడవంతో కాస్త మెత్తబడింది. అయితే స్టే తెచ్చి విచారణను తప్పించుకున్నారే గానీ నైతికంగా బాబు దోషే అని వైసీపీ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సాక్షి పత్రిక ఓ ఆసక్తికర కథనాన్ని వెలువరించింది. విచారణను ఎదుర్కొనే విషయాల్లో గత దివగంత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నిక్కచ్చిగా వ్యవహరిస్తే.. చంద్రబాబు మాత్రం విచారణ నుంచి తప్పించుకోవడానికి స్టే ల మీద స్టేలు తెచ్చుకుంటున్నారనేది దాని సారాంశం.
గతంలో వైఎస్ వ్యవహరించిన తీరు :
అప్పట్లో తీవ్ర సంచలనం స్రుష్టించిన పరిటాల రవీంద్ర హత్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. హత్య కేసులో అరెస్టయిన మంగలి క్రుష్ణ.. హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారని 1999-2004లో మధ్యకాలంలో.. అధికార టీడీపీ శాసనసభలో తీర్మానం పెట్టింది.
టీడీపీ తీర్మానానికి సహకరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చర్చకు అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హత్య కుట్రలో తన తనయుడి పాత్ర ఉన్నట్లు తేలితే ఉరితీయాలని, సీబీఐ విచారణకు సైతం డిమాండ్ చేశారు.
ఆ తర్వాత పరిటాల రవి హత్య కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు, జగన్మోమహన్ రెడ్డి మీద ఆరోపణలు రావడంతో.. దానిపై సమగ్ర విచారణ జరిపించారు రాజశేఖరరెడ్డి.
ఇక అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశం తీవ్ర ఆరోపణలు చేయడంతో.. తన నిజాయితీని నిరూపించుకునేందుకు దానిపై కూడా సీబీఐ విచారణ జరిపించారు వైఎస్. అనంతర కాలంలో వోక్స్ వ్యాగన్ కేసు విషయంలోను సీబీఐతో విచారణ జరిపించారు.
ఇదీ చంద్రబాబు వ్యవహరించిన, వ్యవహరిస్తోన్న తీరు..!
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో.. ఏలేరు కుంభకోణం తెరమీదకు రావడంతో ప్రతిపక్షాలన్ని సీబీఐ విచారణకు డిమాండ్ చేశాయి. కుంభకోణంలో చంద్రబాబు పాత్రను కోర్టులు కూడా ధ్రువీకరించాయి. అయితే విచారణ ఎదుర్కోకుండా చంద్రబాబు మాత్రం కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.
ఇక మద్యం డిస్టలరీలకు అనుమతి మంజూరు చేసే విషయంలోను.. చంద్రబాబు ముడుపులు తీసుకున్నారన్న అభియోగాలు అప్పట్లో వెల్లువెత్తాయి. దీనిపై కాంగ్రెస్ నేత క్రుష్ణకుమార్ కోర్టును ఆశ్రయించడంతో ఏసీబీతో విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో లాగే ఈ కేసు విషయంలోను చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు.
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ.. చంద్రబాబు ఆస్తులు అవినీతిపై అప్పట్లో.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో యథావిధిగా స్టే తెచ్చేసుకున్నారు చంద్రబాబు.
ఇవన్నీ పక్కనబెడితే.. తాజా ఓటుకు నోటు వ్యవహారంలోనే చంద్రబాబు స్టే మంత్రమే జపించారు. విచారణపై ఏసీబీ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ఎట్టకేలకు స్టే తెచ్చుకున్నారు.