వైఎస్ వారికి అన్నం పెడితే... జగన్ వారి పొట్ట కొడుతున్నాడు .. జగన్ పై కన్నా ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడుతున్నారు . వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని మండిపడ్డారు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ . జగన్ కు ఆయన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి చాలా వ్యత్యాసం వుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువతకు ఉద్యోగాలు ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టారని పేర్కొన్నారు . కానీ ఆయన కుమారుడు సీఎం జగన్ మాత్రం ప్రజల పొట్టగొడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు.
రాజన్న పాలన అంటే ఇదేనా అని జగన్ ను ప్రశ్నించిన కన్నా
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నేతలు ఎంతగానో కృషి చేస్తున్నారు . ఆపరేషన్ ఆకర్ష ద్వారా టీడీపీని ఖాళీ చేసే పనిలో పడ్డారు. అలాగే వైసీపీని సైతం వదిలేది లేదని తేల్చి చెప్తున్నారు. రాజన్న పాలన అంటే ఇది కాదని జగన్ మీద నిప్పులు చెరుగుతున్నారు బీజేపీ నేతలు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని, పోరాటం చేస్తామని తేల్చి చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న బీజేపీ నేతలు వైసీపీ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే విధంగా చంద్రబాబు పై కూడా నిప్పులు చెరుగుతున్నారు.
జగన్ కు వైఎస్ఆర్ కు ఏ మాత్రం పోలిక లేదన్న కన్నా లక్ష్మీ నారాయణ
అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, కన్నా లక్ష్మీనారాయణ పైవ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను అనంతపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.. దివంగత వైయస్ రాజశేఖరెడ్డికి, ముఖ్యమంత్రి జగన్ కు అసలు ఏ మాత్రం పోలిక లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వైయస్ ఉద్యోగాలిచ్చి అన్నం పెట్టారని... జగన్ మాత్రం జనాల పొట్టగొడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు కన్నా . ఫీల్డ్ అసిస్టెంట్లకు వైయస్ ఉద్యోగావకాశాలను కల్పిస్తే, జగన్ వారికి మంగళం పలుకుతున్నారని, వారి పొట్ట కొడుతున్నారని ఆరోపిస్తున్నారు.
Recommended Video
వైసీపీ నుండి కూడా బీజేపీలోకి చేరికలుంటాయన్న కన్నా
రాజన్న పాలనను మళ్లీ తెస్తామని చెప్పుకున్న జగన్ కు అంత సీన్ లేదని ఆయన క్షేత్ర స్థాయిలో మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కన్నా పేర్కొన్నారు . ప్రజావ్యతిరేక విధానాలను జగన్ అవలంబిస్తే బీజేపీ పోరాటం చేస్తుందని కన్నా హెచ్చరించారు .ఇక ఈ నెలలో టీడీపీ, జనసేన నుంచే కాకుండా వైసీపీ నుంచి కూడా బీజేపీలోకి చేరికలు ఉండబోతున్నాయని కన్నా షాకింగ్ న్యూస్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కన్నా లక్ష్మీ నారాయణ తన అభిప్రాయం చెప్పారు .రాష్ట్రంలో బీజేపీ బలపడలేకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని మండిపడ్డారు కన్నా . అటు టీడీపీని, ఇటు వైసీపీ సర్కార్ ను , సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ ఏపీలో పుంజుకునే యత్నం చేస్తుంది.