ఆ విషయంలో బాబు ఎందుకని వైఎస్లా ఉండరు?: అధినేతపై తీవ్ర అసంతృప్తిలో తమ్ముళ్లు!
పదవులు.. వగైరా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. కలిసినప్పుడు ఆప్యాయంగా ఓ చిరునవ్వి నవ్వి, భుజం తడితే ఎంత బాగుంటుందని కలత చెందుతున్నారట.
విజయవాడ: రాజకీయ పార్టీల లోటుపాట్లను విశ్లేషించడంలో వాటి అనుకూల మీడియా పాత్ర కొన్నిసార్లు విచిత్రంగానే ఉంటుంది. ఆయా పార్టీల అధినేతలను ఎప్పుడూ వెనుకొస్తే 'డబ్బా' కొడుతున్నారని ఎక్కడ జనం భావిస్తారోనన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు కొన్ని పసలేని కథనాలను వదలుతుంటారు.
వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'?
తాజాగా అలాంటి కథనమే ఒకటి టీడీపీ అనుకూల మీడియా పత్రికలో అచ్చయింది. చంద్రబాబుకు వైఎస్ కు పోలిక తెచ్చి.. ఇద్దరి వ్యక్తిగత ధోరణుల్ని అందులో విశ్లేషించారు. పార్టీ నేతల పట్ల వైఎస్ ఎంత ఆప్యాయంగా వ్యవహరించేవారు.. చంద్రబాబు మాత్రం ఎందుకు అంటీముట్టనట్లుగానే ఉంటారన్నది అందులో ప్రధానంగా కనిపించిన అంశం.
వైఎస్ లాగా బాబు ఫ్రెండ్లీ కాదని?:
చంద్రబాబు వైఖరితో గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుపోయిందని ఆ కథనంలో పేర్కొన్నారు. దీనికి కారణం.. ప్రభుత్వ పాలన తమ వద్ద నుంచే కొనసాగుతున్నా.. ఎందుకనో తాము దూరం పెట్టబడుతున్నామనే భావనలో వాళ్లు ఉన్నారట. సీఎం వైఖరి వల్లే తమలో ఇలాంటి భావన కలుగుతోందని వాపోతున్నారట.
ఇటీవల సచివాలయానికి వచ్చిన ఓ ఐదుగురు మంత్రులు కూడా దీనిపైనే చర్చించారట. పదవులు.. వగైరా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. కలిసినప్పుడు ఆప్యాయంగా ఓ చిరునవ్వి నవ్వి, భుజం తడితే ఎంత బాగుంటుందని కలత చెందుతున్నారట. అదే వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. ఎవరు ఆయన వద్దకు వెళ్లిన ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, వారి సమస్యలు వినడానికి సమయం కేటాయించేవారట.
Recommended Video
దర్శనం కరువు:
ద్వితీయ శ్రేణి నాయకుల సంగతి పక్కనపెడితే.. అసలు మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా సీఎం అపాయింట్ మెంట్ కరువైపోయిందట. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఉంటున్నా.. ఆయన దర్శనం మాత్రం గగనమైపోయిందని చెబుతున్నారట.
వారం రోజుల క్రితం సీఎంను కలవడానికి వెళ్లిన ఓ మంత్రికి ఇలాంటి అనుభవమే ఎదురైందట. అప్పటికే తన ఛాంబర్ లో ఏదో మీటింగ్ లో ఉన్న చంద్రబాబు ఆయన్ను రెండు గంటలు వెయిట్ చేయించారట. ఆయనతో పాటు మరో ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారట.
చాలాసేపు వెయిట్ చేయించిన తర్వాత.. కేవలం ఒక్క నిమిషం సమయాన్ని మాత్రమే కేటాయించి సదరు మంత్రిని సీఎం అక్కడి నుంచి పంపిచేశారట. దీంతో ఈమాత్రం దానికి ఇంతసేపు వెయిట్ చేయించాలా? అన్న అసహనంతో ఆయన వెనుదిరిగారట. ఆయనొక్కరే కాదు, పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇదే అసహనంలో ఉన్నట్లుగా టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోందట.
బాబుపై అసంతృప్తిలో నేతలు:
సచివాలయంలో ఈ ఐదుగురు మంత్రులు బాబు గురించి మాట్లాడుతుండగానే మరో జిల్లా అధ్యక్షుడు కూడా అక్కడికి వచ్చారట. మూడు నెలల నుంచి సీఎంతో ఐదు నిమిషాలు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా.. పని కావడం లేదని అన్నారట. తమ జిల్లాకు చెందిన పార్టీ ఇన్ చార్జీ ఒకరి గురించి మాట్లాడుదామని వస్తే.. సీఎం దర్శనం దొరకలేదని, ఈలోపు అతను రాజీనామా చేసేశాడని అన్నారట. అతనితో సీఎం మాట్లాడి ఉంటే పరిస్థితి ఇంతదాకా రాకపోయేదని, రేప్పొద్దున జనంలోకి వెళ్లాల్సిన ఎమ్మెల్యేల పట్ల ఇలా అలసత్వంగా వ్యవహరిస్తే ఎలా అని బాధపడ్డారట.
ఇప్పటికైనా మారుతారా?:
ఈ కథనం మొత్తాన్ని పరిశీలిస్తే.. వైఎస్ లాగా చంద్రబాబు అంత ఫ్రెండ్లీగా ఉండలేకపోతున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఆయన ఆప్యాయ పలకరింపు కోసం.. ఆయన ముఖంలో నవ్వు కోసం వారు ముఖాలు వాచిపోయేలా ఎదురుచూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ వైఖరిలో మార్పు రాకుంటే ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మరి తమ్ముళ్ల అసంతృప్తిని రూపుమాపేలా సీఎం ఇప్పటికైనా వారిని చూడగానే నవ్వులు చిందిస్తారో.. లేదో.. వేచి చూడాలి.