టీడీపీలో పాము-ముంగీసల కొట్లాట?: చిత్తు చేసే ఎత్తుగడలు.. ఇదీ మర్మం!
అటు జడ్పీ చైర్మన్ విషయంలోను, ఇటు కలెక్టర్ విషయంలోను తనను పట్టించుకోకపోవడంతో ఆయనలో అసంతృప్తి గూడుకున్నట్లుగా చెబుతున్నారు.
కాకినాడ: పాము ముంగీసల్లాంటి శత్రువులు ఒకే ఒరలో ఒదుగుతారనుకోవడం కలలో కూడా సాధ్యం కానీ పని. అదంతా పైపై భ్రాంతి మాత్రమే అవుతుంది తప్ప.. కలహాల కాపురం సజావుగా సాగడం అయ్యే పని కాదు. ఏపీ అధికార పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ లోడ్ ఎక్కువవడం ఇప్పుడిలాంటి కలహాలకే దారితీస్తోంది.
ఒకే జిల్లాకు చెందిన సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ మధ్య అంతర్గత విభేదాలు రగులుతూనే ఉన్నాయి. ఒకరి మీద ఒకరు పైచేయి సాధించడానికి ఎవరి దారిలో వారు పాచికలు పారిస్తూనే ఉన్నారు. జిల్లా రాజకీయం ఎక్కడ జ్యోతుల గుప్పిట్లోకి వెళ్తుందోనన్న ఆందోళనలో యనమల.. వైసీపీ నుంచి అధికార పార్టీలోకి వచ్చి కూడా జీరోగా మిగిలిపోవద్దన్న భావనలో జ్యోతుల ఉండటంతో.. జిల్లాలో ఈ ఇద్దరూ తమను తాము 'పవర్ సెంటర్'గా నిలుపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
అధిష్టానంపై యనమల గుర్రు:
జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి రావడం యనమలకు ఏమాత్రం రుచించని వ్యవహారమనేది అందరికీ తెలిసిన సత్యమే. అధిష్టానం నిర్ణయానికి తలొగ్గి జ్యోతుల రాకను ఆహ్వానించినా.. జిల్లాలో ఎక్కడ తన అధికారానికి ఎసరు పెడుతారోనన్న భయం యనమలలో ఉంది. అందుకే పట్టుబట్టి మరీ జ్యోతులకు మంత్రి పదవి రాకుండా యనమల అడ్డుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.
మంత్రి పదవి రాకుండా చేయగలిగి.. హమ్మయ్యా అనుకున్న యనమలకు అధిష్టానం మరో షాక్ ఇచ్చింది. ఈసారి జిల్లా జడ్పీ ఛైర్మన్ ను ఏకంగా జ్యోతుల నెహ్రూ కుమారుడికి కట్టబెట్టేందుకు సిద్దపడింది. జ్యోతుల కొడుకు జడ్పీ ఛైర్మన్ అయితే జిల్లా రాజకీయంలో తన పట్టు ఎక్కడ సడలుతుందోనని యనమలలో కంగారు మొదలైంది.
జ్యోతులను నిలువరించేలా ప్లాన్:
జ్యోతులను ప్రత్యక్షంగా ఎదుర్కోవడమంటే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినట్లవుతుంది కాబట్టి.. ఈ వివాదానికి వెనుక నుంచి వీలైనంత మంట పెట్టారు యనమల. ప్రస్తుత జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబును జ్యోతుల మీదకు ఉసిగొల్పి పరోక్షంగా ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఛైర్మన్గా పనిచేసేందుకు తాము సరిపోమా? అని నామన వర్గీయులు అధిష్టానాన్ని గట్టిగానే నిలదీశారు.
ఓవైపు కాపులకు అన్యాయం చేశారన్న కారణంతో.. ఆ సామాజిక వర్గమంతా టీడీపీకి వ్యతిరేకంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు మాటిచ్చి వెనక్కి తగ్గితే.. పార్టీకి మరింత డ్యామేజీ జరుగుతుందని టీడీపీ అధిష్టానం భావించింది. దీంతో రాంబాబును పక్కకు తప్పించి జ్యోతుల వైపు మొగ్గు చూపక తప్పలేదు.
కోల్డ్ వార్.. లోకేష్ డైరెక్షన్?:
మొత్తం మీద తూర్పు గోదావరి జిల్లా రాజకీయంలో యనమల-జ్యోతుల మధ్య కోల్డ్ వార్ బాగానే రక్తి కడుతోంది. ఒకరిని చిత్తు చేయడానికి ఒకరు ఎప్పుడూ ఏదో ఎత్తుగడతో సిద్దమవుతూనే ఉన్నారు. నిజానికి టీడీపీలో నంబర్.2గా కొనసాగుతున్నా.. జ్యోతుల హవాను అడ్డుకోవడం విషయంలో అధిష్టానం తనకు అడ్డుపడుతోందని యనమల భావిస్తున్నట్లు చెబుతున్నారు.
లోకేష్ ఎంట్రీతో యువ రాజకీయాలకు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉండటంతో.. రాను రాను పార్టీలో సీనియర్ అయిన తనను ఎక్కడ పక్కన పెట్టేస్తారోనన్న ఆందోళన కూడా యనమలను వెంటాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ విషయంలోను యనమలను పట్టించుకోలేదు:
జిల్లా కలెక్టర్ గా కార్తికేయ మిశ్రాను నియమించిన విషయంలోను మంత్రి యనమలను ప్రభుత్వం పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది. అటు జడ్పీ చైర్మన్ విషయంలోను, ఇటు కలెక్టర్ విషయంలోను తనను పట్టించుకోకపోవడంతో ఆయనలో అసంతృప్తి గూడుకున్నట్లుగా చెబుతున్నారు.
మరోవైపు యనమల ఎలాగూ తనకు అడ్డుపడుతారని తెలిసిన జ్యోతుల.. తన రాజకీయాలకు సంబంధించి నేరుగా చంద్రబాబు, లోకేష్ లతోనే మంతనాలు జరిపి పనులు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. మొత్తం మీద టీడీపీలో యనమల-జ్యోతుల మధ్య ఫైట్ పాము-ముంగీసలను తలపిస్తోందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.