రాఘవులు, నారాయణ మధ్య జగన్ సీట్ల చిచ్చు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో సంబంధాల వ్యవహారం ఉభయ కమ్యూనిస్టుల మధ్య చిచ్చు పెట్టింది. వైయస్ జగన్తో సిపిఎం సీట్ల సర్దుబాటు చేసుకుందని సిపిఐ కార్యదర్సి కె. నారాయణ చేసిన వ్యాఖ్యకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు భగ్గుమన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సిపిఎం సీట్ల సర్దుబాబు చేసుకుందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలను బీవి రాఘవులు ఖండించారు. నారాయణ వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని ఆయన అన్నారు.
ఈ మేరకు నారాయణకు రాఘవులు బహిరంగ లేఖ రాశారు. మీడియా సమావేశంలో ఆ లేఖను విడుదల చేశారు. నారాయణ వ్యాఖ్యల్లో నిజాయితీ ఉంటే రుజువు చేయాలని సవాల్ విసిరారు. పొత్తులపై ఇప్పటివరకు తమ పార్టీలో చర్చించలేదని రాఘవులు స్పష్టం చేశారు. నారాయణ చౌకబారుగా మాట్లాడడం వల్ల తమ పార్టీ ప్రతిష్టకొచ్చే నష్టమేమీ లేదని ఆయన అన్నారు.
వామపక్ష ఐక్యత విషయంలో తమ పార్టీ పద్ధతి చెప్తే నారాయణకు ఎందుకు అంత ఆందోళనని రాఘవులు ప్రశ్నించారు. తమ పార్టీపై నారాయణ ఆరోపణలు తగదని ఆయన హెచ్చరించారు. మనల్ని మనం చులకన చేసుకోవద్దని నారాయణకు చురకలు అంటించారు. చాటుమాటుగా మాట్లాడుకోవడం తమకు అలవాటు లేదన్నారు. జాతీయ కార్యవర్గ నిర్ణయాలకు తాము కట్టుబడి ఉంటామని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోమని చెప్పారు.
వామపక్షాల ఐక్యతపై సిపిఎం ఇటు తమతో మాట్లాడుతూనే అటు వైయస్సార్ సీట్ల బేరానికి దిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గురువారం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు వైఖరిపై మండిపడ్డారు. తమది సమైక్యవాదమంటున్న ఆ పార్టీ ఆ మేరకు ప్రజల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తమ వైఖరిని ధైర్యంగా చెప్పుకోలేని దుస్థితిలో ఉండటమే ఇందుకు కారణమని అన్నారు.
గత ఎన్నికలలో కాంగ్రెస్-తెరాస (2004), తెలుగుదేశం - తెరాస (2009)లతో కూటమిగా వామపక్షాలు పోటీ చేశాయని గుర్తుచేశారు. ఆ సమయంలో వారికి సమైక్యవాదం జ్ఞాపకం లేదా? అని ఆయన రాఘవులును ప్రశ్నించారు.