చిరు-పవన్: ఆరెంజ్తో ముదిరిందా, పార్టీపై నిలదీశారా?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పెడతారనే వార్తలు ఊపందుకోవడంతో మెగా సోదరుల మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ప్రజారాజ్యం పార్టీ విలీనంతో మొదలైన విభేదాలు ఆరెంజ్ సినిమాతో ముదిరిపోయాయని అంటున్నారు. చిరంజీవి తన పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసినప్పటి నుండి చిరంజీవి, పవన్ కల్యాణ్ల మధ్య విభేదాలు చర్చనీయాంశమవుతున్నాయి.
పవన్కు పిఆర్పీని విలీనం చేయడం ఇష్టం లేదని.. అప్పటి నుండి విభేదాలు వచ్చాయనే ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత మెగా కుటుంబ సభ్యుల వేడుకల్లో పాల్గొనక పోవడంతో అవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు కొత్త పార్టీ పెడుతుండటంతో ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతున్నాయని చెబుతున్నారు.
ఆరెంజ్ సినిమాతో మరో సోదరుడు నాగబాబు నష్టపోయిన సమయంలో ఆయనను పవన్ ఆదుకున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి, రామ్ చరణ్ తేజలు పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తొలి సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన చిరు, పవన్ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. చిరు కన్నా పవన్ ముందే వచ్చారు. వరుణ్ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలో.. చిరు పవన్ చేతికి అక్షింతలు ఇచ్చి వేయమని కోరగా, వాటిని వేసిన పవన్ అక్కడి నుండి దూరంగా వెళ్లిపోయారు. ఫ్యామిలీ ఫోటో తీసే సమయంలో కూడా రాలేదు.
మరోవైపు పవన్ కొత్త పార్టీపై జోరుగా ప్రచారం సాగుతుండటంతో... చిరంజీవి వెళ్లి పవన్ కల్యాణ్ను నిలదీసినట్లుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తనకు, చిరంజీవికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని పవన్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. మరి పవన్ కొత్త పార్టీ పెడతారా లేక చిరు వైపు ఉంటున్నట్లు ప్రకటిస్తారా అనేది చూడాలి.