ఏవీ సుబ్బారెడ్డి Vs భూమా: ఆ మీటింగ్కు వెళ్ళొద్దు: అఖిల, వివాదానికి కారణమిదే, ఏం జరుగుతోంది?
కర్నూల్: కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ టిడిపిలో గ్రూపు తగాదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి నిర్వహించే కార్యక్రమానికి వెళ్ళొద్దంటూ మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో మరోసారి ఆళ్ళగడ్డ టిడిపిలో ఏం జరుగుతోందోననే ఉత్కంఠ నెలకొంది.
దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి అనుచరుడుగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి, మంత్రి భూమా అఖిలప్రియకు మధ్య ఇటీవల కాలంలో అంతరం పెరుగుతోంది.
కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ వర్గాల మధ్య గ్యాప్
కర్నూల్ జిల్లాలోని కర్నూల్, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో భూమా నాగిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. అయితే భూమా నాగిరెడ్డి బతికున్న సమయంలో ఆయనతో సన్నిహిత సంబంధాలున్న ఏవీ సుబ్బారెడ్డికి ప్రస్తుతం మంత్రిగా ఉన్న భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియకు మధ్య అంతరం పెరుగుతుంది. ఏవీ సుబ్బారెడ్డి నంద్యాల ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు స్థానికంగా ఉన్న కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపిలో కలకలం రేపింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంత్రి అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఉన్న సమన్వయం కుదిర్చారు. అయితే మరోసారి ఈ ఇద్దరి మధ్య ఇటీవల కాలంలో మరోసారి అంతరం పెరుగుతూ వస్తోంది.
వివాదానికి కేంద్రంగా మారిన ఏవీ హెల్ప్లైన్
ఆళ్ళగడ్డలో ఏవీ సుబ్బారెడ్డి ఏవీ హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ హెల్ప్లైన్ ప్రారంభ కార్యక్రమానికి వెళ్ళకూడదని మంత్రి అఖిలప్రియ తన అనుచరులకు సమాచారం ఇచ్చారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఏవీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ మంత్రి నుండి టిడిపి కార్యకర్తలకు ఆదేశాలు వెళ్ళాయంటున్నారు. ఈ కారణంగానే ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ వర్గాల మధ్య మరోసారి ఆధిపత్య పోరు తెరమీదికి వచ్చింది.
భూమా నాగిరెడ్డి వర్ధంతి సభకు ఏవీ సుబ్బారెడ్డి గైరాజరు
ఇటీవల ఆళ్ళగడ్డలో నిర్వహించిన భూమా నాగిరెడ్డి వర్ధంతి సభకు కూడ ఏవీ సుబ్బారెడ్డి గైరాజరయ్యారు.అయితే ఈ వర్థంతి సభకు ఏవీ సుబ్బారెడ్డికి ఆహ్వనం అందలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన ఈ కార్యక్రమానికి హజరుకాలేదనే ప్రచారం కూడ ఉంది. అయితే భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమానికి గైరాజరు కావడం చర్చకు దారితీసింది.
Recommended Video
చర్చనీయాంశమైన మంత్రి అఖిలప్రియ కామెంట్స్
ఇటీవల జరిగిన భూమా నాగిరెడ్డి వర్ధంతి సభలో మంత్రి భూమా అఖిలప్రియ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో కొందరు తనను ఏడిపించేందుకు ప్రయత్నించారని ఆమె వ్యాఖ్యానించారు. ఆళ్ళగడ్డ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూమా అనచరులను కంటికి రెప్పలా కాపాడుకొంటామని ఆమె హమీ ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య పెరుగుతున్న గ్యాప్ను తగ్గించకపోతే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.