పరిటాల సునీత వర్సెస్ పల్లె: చిచ్చు పెట్టిన చంద్రన్న రంజాన్ తోఫా
అనంతపురం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రన్న రంజాన్ తోఫా' అనంతపురం జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు పెట్టింది. ఇరువుర మంత్రుల మధ్య ఆధిపత్య పోరుకు అది కారణమైంది. జిల్లానుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత, మైనారిటీ, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి.
చంద్రన్న రంజాన్ తోఫా కిట్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలపై మైనారిటీశాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి ఫొటో ముద్రించకపోవడంతో వివాదం ప్రారంభమైంది. దీన్ని తీవ్రంగా తీసుకున్న మంత్రి పల్లె ఆ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పౌరసరఫరాలశాఖ మంత్రి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
రంజాన్ సందర్భంగా తెల్ల కార్డు ఉన్న ముస్లింలకు ఉచితంగా ‘చందన్న రంజాన్ తోఫా' పేరిట ఐదు కిలోల గోధుమపిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమియా, వంద గ్రాముల నెయ్యి ఉచితంగా అందజేస్తున్నారు. వీటన్నంటిని ఒక సంచిలో పెట్టి మైనారిటీలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం రంజాన్ తోఫాపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు ముస్లింల ఆదరణ చూరగొనాలని యత్నించింది.
అయితే రంజాన్ తోఫా సంచిపై మైనారిటీ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి ఫోటో మాయమైంది. రంజాన్ తోఫా ప్రచార కార్యక్రమాలు, కిట్ల సంచులు, గోడ పత్రికలు, ప్రచార ఫ్లెక్సీలు, ఆఖరుకు కార్యక్రమం ప్రారంభానికి కూడా సంబంధితశాఖ మంత్రి లేకుండానే కానిచ్చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం తమ శాఖకు చెందిన కార్యక్రమం అంటూ పౌరసరఫరాలశాఖ దూకుడుగా వ్యవహరించింది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రతి విషయంలో ముఖ్యమంత్రి ఫొటోతో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఫొటోలు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వీటిలో ఎక్కడా మైనారిటీశాఖ మంత్రి పల్లె ఫొటో లేకపోవడం గమనార్హం. అంతేగాక ఆఖరుకు రాయలసీమ జిల్లాల్లో కిట్ల పంపిణీ సమయంలో సైతం మంత్రి పరిటాల సునీత మాత్రమే ఉండేటట్లు వ్యవహరించారు. దీనిపై మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కినుక వహించి పౌరసరఫరాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టనని హెచ్చరించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వెంటనే సంబంధితశాఖ మంత్రి, అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. ఇదేమైనా మీ స్వంత వ్యవహారం అనుకున్నారా.. సంబంధితశాఖ మంత్రికి తెలియకుండా కార్యక్రమాలు నిర్వహిస్తారా, ఇలా చేయడం వల్ల ప్రభుత్వం, పార్టీ పరువు ఏమయిపోతుందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి క్లాస్ తీసుకోవడంతో పౌరసరఫరాలశాఖ అధికారులు అప్పటికప్పుడు తప్పిదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే ఫ్లెక్సీలపై మైనారిటీశాఖ మంత్రి పల్లె ఫొటో అతికించారు. మైనారిటీశాఖ మంత్రి సందేశంతో కూడిన కరపత్రాన్ని ముద్రించి రంజాన్ తోఫాతో పాటు పంపిణీ చేయాలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాత్రికిరాత్రికి కరపత్రాలు ముద్రించి డీలర్లకు సరఫరా చేశారు.