బెజవాడ వైసిపిలో రచ్చ, ఇదీ కారణం: రంగంలోకి జగన్, గౌతమ్ రెడ్డి సస్పెన్షన్
బెజవాడ వైసిపిలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. గౌతమ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరు గ్రూపుల మధ్య వివాదం రాజుకుంది. వంగవీటి రంగా, రాధాలపై గౌతమ్ చేసిన వ్యాఖ్యలకు వంగవీటి రాధా వర్గం మండిపడింది.
Recommended Video
విజయవాడ: బెజవాడ వైసిపిలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. గౌతమ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరు గ్రూపుల మధ్య వివాదం రాజుకుంది. వంగవీటి రంగా, రాధాలపై గౌతమ్ చేసిన వ్యాఖ్యలకు వంగవీటి రాధా వర్గం మండిపడింది.
గుమికూడిన అభిమానులు
వంగవీటి రాధా, రత్నకుమారిల ప్రెస్ మీట్కు పోలీసులు నిరాకరించారు. దీంతో వంగవీటి సానుభూతిపరులు నిప్పులు చెరిగారు. భారీస్థాయిలో వంగవీటి అభిమానులు గుమికూడారు. రాధా ఇంటి వద్ద, కార్యాలయం వద్దకు అభిమానులు వచ్చారు.
వంగవీటి అరెస్ట్, విడుదల
పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగాను, రత్నకుమారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం కొద్దిసేపటికి విడుదల చేశారు. విడుదల అనంతరం వారు అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లారు.
గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై సీరియస్, సస్పెన్షన్
వైసిపి నేత గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. వెంటనే జగన్ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత గౌతమ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణా సంఘంను జగన్ ఆదేశించారు. అయితే, సస్పెన్షన్ విషయం తనకు తెలియదని, మీడియాలోనే చూస్తున్నానని గౌతమ్ రెడ్డి చెప్పారు.
రచ్చకెక్కిన గ్రూపు విభేదాలు
బెజవాడ వైసిపిలో గౌతమ్ రెడ్డి, వంగవీటి వర్గాల మధ్య చాలా రోజులకు గ్రూపు విభేదాలు రచ్చకెక్కాయి. వీరి మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. వీరి మధ్య విభేదాలపై అధిష్టానం ముందే దృష్టి సారించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గౌతమ్ రెడ్డి ఆగ్రహం వెనుక..
వంగవీటి కుటుంబంపై గౌతమ్ రెడ్డి తీవ్ర విమర్శలకు కారణం ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో గౌతమ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. తన ఓటమికి వంగవీటి వర్గం అని భావిస్తున్న ఆయన.. వారిపై ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు అదే కారణమని అంటున్నారు.
ప్రెస్ మీట్కు అనుమతిస్తే.. ఉద్రిక్తత ఉండకపోయేది
గౌతమ్ రెడ్డి తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలకు వంగవీటి రాధాకృష్ణ ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కౌంటర్ ఇచ్చేందుకు ఆయన మీడియా ముందుకు రావాలనుకున్నారు. కానీ పోలీసులు అడ్డుకున్నారని అంటున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడిందని తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్త పడ్డారని అంటున్నారు. అయితే ప్రెస్ మీట్కు అనుమతిస్తే ఉద్రిక్తత ఉండకపోయేదని అంటున్నారు.