ఆమంచి పై వైసీపిలో భిన్నస్వరాలు..! స్థానిక నేతలనుండి వ్వక్తమవుతున్నవ్యతిరేకత..!!
అమరావతి/ హైదరాబాద్ : రాజకీయాల్లో సంచలనాలు తాత్కాలికమేనని అనేక సందర్బాల్లో రుజువైంది. ఇటీవల ఏపి రాజకీయాల్లో అనేక సంచలనాలు జరుగుతున్న విషయం కూడా గమనిస్తున్నాం. ముఖ్యంగా అదికార టీడిపి చిన్నా పెద్దా తేడా లేకుండా అనేక మంది నేతలు ప్రతిపక్ష పార్టీలో చేరిపోయారు. ఇంకా కొంత మంది క్యూలైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంత వరకూ వలసల ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతున్నప్పటికి..నేతలు పార్టీ చేరిన తర్వాత అసలు వ్యవహారం తెరమీదకు వస్తోంది. పార్టీలోచేరుతున్న నేతల పట్ల ఒక్కసారిగా వ్యతిరేకత వక్తం చేయకపోయినప్పటికి నియోజకవరంగాల్లో మాత్రం దాని ప్రభావం తీవ్రంగా పడుతోందని వైసిపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. తాజాగా చీరాల లో ఆమంచి క్రిష్ణ మోహన్ చేరిక పట్ల స్థానికంగా వ్యతిరేకత మొదలైనట్టు తెలుస్తోంది.
ఆమంచి చేరికకు వైసీపిలో మొదట్లో సమ్మతం..! తర్వాత వ్యతిరేకం..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీని వీడటం సంచలనంగా మారిన విషయం తెలిసందే..! సీఎం చంద్రబాబుకు తన రాజీనామా లేఖ సమర్పించిన ఆమంచి, వెంటనే వైసీపీ అధినేత జగన్ తో చేతులు కలిపి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆమంచి వైసీపీ గూటికి చేరటం ఆ పార్టీ నేతలకు అస్సలు ఇష్టం లేదని తెలుస్తోంది. ఆయన జగన్ ను కలిసిన మరు నిమిషమే చీరాల వైసీపీలో ఆమంచి గో బ్యాక్ అంటూ తిరుగుబాటు మొదలైంది. కాని పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం పట్ల కొంత కాలం సంయమనం పటించినా ఇప్పుడు విభేదాలు బహిర్గతం అవుతున్నాయి.
ఆమంచి పై జిల్లా వ్యాప్తంగా నిరశనలు..! వ్యతిరేకిస్తున్న స్థానిక వైసీపి నేతలు..!!
ప్రకాశం జిల్లా చీరాలలో స్వయంగా వైసీపీ నేతలంతా రోడ్లపైకి వచ్చి నిరసన జ్వాలలు రగిలించారు. నల్ల జెండాలు చేతబట్టి తమ తిరుగుబాటును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో చీరాల సీటుపై జగన్ ఆశలు వదిలేసుకోవాల్సిందేనని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన వ్యక్తిగత అవసరాల కోసం ఇంతకాలం టీడీపీలో ఉన్న ఆమంచిలో ఏ మాత్రం మంచి లేదని వారన్నారు. మూడున్నారేళ్లపాటు వైసీపీ కార్యకర్తలకు నరకం చూపించిన అమంచిని జగన్ సాదరంగా ఆహ్వానించడం చీరాల వైసీపీ నేతలకు మింగుడుపడటం లేదట. ఆమంచి జగన్ ని కలిశారో లేదో వెంటనే రగిలిపోతూ తిరుగుబాటు ప్రకటించారు చీరాల వైసీపీ నేతలు. అంతేకాదు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీలు చేయటం గమనార్హం.
ఆమంచి అంత మంచోడు కాదంటున్న నేతలు..! గెలుపు కష్టమే అంటున్న వైసీపి నేతలు..!
ఆమంచిని వైసీపీలోకి స్వాగతిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా చీరాల మునిసిపాలిటీలో వైస్ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత రమేష్ తన పదవికి రాజీనామా చేశారు. వైఎస్ విగ్రహాలను కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టించిన అమంచికి జగన్ స్వాగతం పలకడం దారుణమని వైసీపీ నేతలంతా ముక్త కంఠంతో మండిపడుతున్నారు. ఆమంచి రాక వైసీపీని బ్రష్టు పట్టించిందంటూ నిరసన తెలియజేశారు. వైసీపీని భూస్థాపితం చేయడానికే ఆమంచి పార్టీలోకి వచ్చారని, పార్టీని నమ్ముకున్న వారికి వైసీపీలో స్థానం లేదని మరోసారి నిరూపించబడిందని ఆవేదన వ్యక్తం చేశారు నేతలంతా. ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీకి చోటు లేదని నినాదాలు చేస్తున్నారు.
జగన్ విదేశీ పర్యటన..! స్వదేశం వచ్చిన తర్వాత తేల్చుకుంటామంటున్న నేతలు..!!
మరోవైపు టీడీపీ నేతలు కూడా ఆమంచి తమ పార్టీని వీడటం సంతోషకరమైన విషయమని పేర్కొంటున్నట్టు సమాచారం. కొందరైతే ఏకంగా బాంబులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారట. ఓ వైపు టీడీపీ సంబరాలు.. మరోవైపు వైసీపీ నిరసనలు.. అన్నింటికీ కారణం ఆమంచే. అంటే.. ఈయన ఎంత సమర్థత కలిగిన నేతో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. పార్టీ అధినేత విదేశాల్లో ఉన్నప్పుడు ఆమంచి పరిస్థితి ఇలా అయిందేంటబ్బా అనుకుంటున్నారు పార్టీ నేతలు.