ఏపిలో మంత్రులకు తప్పని ఎదురీత..! కాస్త అటుఇటు ఐనా పడవ బోల్తా పడ్డట్టే..!!
విజయవాడ/హైదరాబాద్ : ఏపిలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో 18 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్ధులు ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్ధుల విజయావకాశాలపై గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో చర్చ సాగుతోంది.
ఇదే కోవలో చంద్రబాబు కేబినెట్ లో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి తాజా పరిస్ధితి ఏమిటన్న దానిపై సగటు ఓటరులో ఆసక్తి నెలకొంటోంది. చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వారిలో సగానికి పైగా మంత్రులకు ఈసారి ఎదురీత తప్పేలా లేదనే చర్చ జోరుగా జరుగుతోంది.
కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పోటీ చేస్తున్న పలువురు మంత్రులకు గడ్డు పరిస్ధితులు ఎదురవుతున్నాయి. వైసీపీతో పాటు జనసేన పార్టీకి చెందిన ప్రత్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో మంత్రులకు గట్టి సవాల్ విసురుతున్నారు. కృష్ణాజిల్లా మైలవరంలో మంత్రి దేవినేని ఉమ, తిరువూరులో మంత్రి జవహర్, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో మంత్రి పితాని సత్యనారాయణ, నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ సీటులో శిద్ధా రాఘవరావు, కడప ఎంపీ సీటులో మంత్రి ఆదినారాయణరెడ్డి వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. ఇదే అంశం పై అమరావతిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.