ఏపీ ఆర్థిక శాఖలో ఆ సంతకం లేనిదే బడ్జెట్ మంజూరు కుదరదు: త్వరలో కీలక శాఖల్లో..
అమరావతి: రాష్ట్రంలో అవినీతి రహిత పరిపాలనను అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. నిధులు, బడ్జెట్ కేటాయింపుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి డిజిటల్ సంతకాల వ్యవస్థను ప్రవేశ పెట్టారు. ఆర్థిక శాఖలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ డిజిటల్ సంతకాల సత్ఫలితాలను ఇస్తుండటంతో.. మరికొన్ని కీలక శాఖలకు దీన్ని విస్తరించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్, విద్యుత్ వంటి భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న శాఖల్లో డిజిటల్ సంతకాల వ్యవస్థను అమలు చేయొచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఆర్థిక శాఖలో..
డిజిటల్ సంతకాల వ్యవస్థ ప్రస్తుతానికి ఆర్థిక శాఖలో అమల్లో ఉంటోంది. బడ్జెట్ విడుదలకు సంబంధించిన జీవోలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు డిజిటల్ సంతకాలు చేస్తున్నారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన ప్రతి జీవో మీద కూడా కుడివైపున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శుల డిజిటల్ సంతకాలను నమోదు చేస్తున్నారు. చిన్న మొత్తం నుంచి వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను విడుదల చేసే జీవోలపై ముఖ్య కార్యదర్శులు సంతకాలు చేస్తున్నారు. ముఖ్య కార్యదర్శులు కే వీ సత్యనారాయణ, షంషేర్ సింగ్ రావత్ సంతకాలతో ఆయా జీవోలు విడుదలవుతున్నాయి.
రైతు భరోసా జీవోపైనా..
ఆర్థిక శాఖలో ప్రాజెక్టులు, నిర్వహణ యూనిట్ (పీఎంయు), ప్రాజెక్టులు, ఇతర లావాదేవీలకు సంబంధించిన విభాగాలు ఉన్నాయి. ఆయా విభాగాల నుంచి జారీ అయ్యే జీవోలపై విభాగాధిపతులు, కార్యదర్శుల సంతకాలను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి తాజాగా ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ 5,510 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ జీవోపై కేవీ సత్యనారాయణ డిజిటల్ సంతకం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే.
రెండురోజుల ముందే నిధులు..
ఈ పథకం కోసం ప్రభుత్వం ఇదివరకే ఈ వార్షిక బడ్జెట్ లో నిధులను కేటాయించింది. పథకం ప్రారంభించడానికి రెండు రోజుల ముందే నిధులను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలి విడత కేటాయింపుల్లో భాగంగా- 5,510 కోట్ల రూపాయల నిధుల మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేసింది. డిజిటల్ సంతకాల వ్యవస్థను మరి కొన్ని కీలక శాఖల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలను నిర్వహించే శాఖల్లో దీన్ని అమల్లోకి తీసుకుని రానున్నట్లు సమాచారం. విద్యుత్, మున్సిపల్ శాఖల్లో డిజిటల్ సంతకాలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని శాఖలకు విస్తరణ..
ఏ శాఖకు సంబంధించిన నిధులను విడుదల చేయాల్సి వచ్చినప్పటికీ.. ఆ మొత్తం ఆర్థిక శాఖ నుంచే మంజూరు కావడం తప్పనిసరి. మున్సిపల్ శాఖ చాలా సందర్భాల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తుంటుంది. స్థానిక సంస్థల నిర్వహణ అనేది స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. రాబట్టుకున్న పన్నులతోనే పాలనా పరమైన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటుంది. అలాగే- విద్యుత్ శాఖ కూడా. ప్రజల వద్ద నుంచి ఛార్జీల రూపంలో రాబట్టుకున్న బిల్లులను విద్యుత్ కొనుగోళ్ల కోసం బదలాయిస్తుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు శాఖల్లో కూడా ఆర్థిక కార్యకలాపాల్లో పారదర్శకతను తీసుకుని రావడానికి డిజిటల్ సంతకాల వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.