థ్యాంక్స్, జివోఎం చూస్తుంది: ఎపిఎన్జీవోలకు దిగ్విజయ్
భోపాల్: సమ్మెను విరమించినందుకు ఎపిఎన్జీవోలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ఉదయం కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఉదయం మధ్యప్రదేశ్ భోపాల్లో విలేకరులతో మాట్లాడారు. సమ్మె విరమించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు.
మంత్రుల బృందం(జివోఎం) సమన్యాయానికి కృషి చేస్తుందన్నారు. విభజన తర్వాత కూడా ఇరు ప్రాంతాల మధ్య సామరస్యం నెలకొనాలని ఆకాంక్షించారు. ఇరు ప్రాంతాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు యూపిఏ ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు.
కాగా, సుదీర్ఘ సమ్మెకు తెరపడిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ 66 రోజులుగా సమ్మె చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు తాత్కాలికంగా తమ సమ్మెను విరమించుకున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించుకోగా ఇప్పుడు ఎపిఎన్జీవోలు కూడా సమ్మెకు విరామం ప్రకటించారు.
శుక్రవారం నుంచి విధులకు హాజరయ్యేందుకు అంగీకరించారు. దీంతో ఆగస్టు 13వ తేదీ నుంచి సీమాంధ్రలో స్తంభించిన పాలన తిరిగి ప్రారంభం కానుంది. గురువారం ముఖ్యమంత్రి కిరణ్, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఎపిఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు, ఇతర ఉద్యోగ నేతలతో చర్చలు జరిపారు. సమ్మెను పూర్తిగా విరమించేది లేదని అసెంబ్లీకి తీర్మానం వచ్చేదాకా తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.