అవమానం: కోట్లకు క్షమాపణ చెప్పిన డిగ్గీ, సీఎం బ్లాక్లో అగ్నిప్రమాదం
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం నాడు క్షమాపణలు చెప్పారు. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కోట్లకు చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిగ్గీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
ఉదయం విజయవాడలో ఆధునికీకరించిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దిగ్విజయ్ సింగ్ ప్రారంభించారు. అనంతరం పార్టీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో డిగ్గీ పాల్గొన్నారు. ఆయనతో పాటు రఘువీరా రెడ్డి, కెవిపి, పళ్లం రాజు, నాదెండ్ల మనోహర్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
అంతకుముందు దిగ్విజయ్ సింగ్... కోట్ల వద్దకు వెళ్లి సారీ చెప్పారు. ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన రాహుల్ గాంధీ సభ వద్ద భద్రతా సిబ్బంది కోట్లను అడ్డుకున్నారు. దీంతో వేదిక ఎక్కకుండానే కోట్ల వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో కోట్ల వర్గం ఆయన సొంత జిల్లా కర్నూలులోని డీసీసీ కార్యాలయానికి తాళమేశారు.
దీనిపై సమాచారం అందుకున్న దిగ్విజయ్.. కోట్లను చల్లబరిచేందుకు ఓ మెట్టు కిందకు దిగారు. అనంతపురం సభలో జరిగిన అవమానానికి చింతిస్తున్నానని, ఘటనలో తమకు తెలియకుండా జరిగిన పొరపాటును పెద్ద మనసుతో క్షమించాలని కోరారు.
ఏపీ సచివాలయం ఎల్ బ్లాకులో స్వల్ప అగ్ని ప్రమాదం
హైదరాబాదులోని సచివాలయంలో ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విభజనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఎల్ బ్లాకును కేటాయించారు. ఈ బ్లాకులో టాప్ ఫ్లోర్ లో చంద్రబాబు కార్యాలయం ఉంది. ఈ రోజు ఉదయం ఉన్నట్టుండి ఎల్ బ్లాకు కింది ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో వెనువెంటనే అప్రమత్తమైన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పై అంతస్తులో సీఎం కార్యాలయం ఉన్న బ్లాక్లోనే అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.