ఐదారు అంశాలు చూడండి: డిగ్గీ, రేణుకపై అధినేత్రికి లేఖ
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎన్నికల ప్రచార, ప్రణాళిక కమిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ భేటీ అయి పలు సూచనలు చేశారు. ఐదారు అంశాలను మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై సలహాలు స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్ సైట్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. 22వ తేదీలోగా మేనిఫెస్టోకు ప్రాథమిక రూపం ఇవ్వాలన్నారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ముప్పై మందిని స్టార్ కంపెయినర్లుగా ఎంచుకోవాలని సూచించారు. ప్రసార, సామాజిక మాధ్యమాలను ప్రచారానికి వినియోగించుకోవాలన్నారు. జాతీయస్థాయి నేతలు కొందరు ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. బిసి, ఎస్టీ, ఎస్సీ సంఘాలతో చర్చించాలని, మేనిఫెస్టోలో అందుకు సంబంధించిన అంశాలను పొందు పర్చాలన్నారు. కాగా, గాంధీ భవన్లో దిగ్విజయ్ నేతలతో విడివిడిగా మంతనాలు జరిపారు.
కాంగ్రెస్లో చేరిన గజ్జెల కాంతం
దిగ్విజయ్ సింగ్ సమక్షంలో తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస ఛైర్మన్ గజ్జెల కాంతం శుక్రవారం కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా చొప్పదొండి స్థానం నుంచి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తానని ఆమెకు ద్విగ్విజయ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ పునర్ నిర్మాణం కాంగ్రెసు పార్టీతోనే సాధ్యమని శ్రీధర్ బాబు చెప్పారు. అందరి సూచనలకు అనుగుణంగా కాంగ్రెసు విజన్ డాక్యుమెంట్ ఉంటుందన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెసు ప్రభుత్వమే అన్నారు. అభివృద్ధి, పునర్ నిర్మాణం కాంగ్రెసుతోనే సాధ్యమన్నారు. తాము జెఏసి సూచనలు కూడా తీసుకుంటామని మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. డిగ్గీ పలు సూచనలు చేశారన్నారు.
సోనియా వల్లే తెలంగాణ: డిగ్గీ
సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని డిగ్గీ అన్నారు. గజ్జెల కాంతంకు టిక్కెట్ సంగతి పార్టీ చూసుకుంటుందన్నారు. పొత్తుల విషయం ఆంటోని కమిటీ పరిశీలిస్తుందన్నారు.
రేణుకను తొలగించాలని లేఖ
కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలంగాణ ప్రాంత ఎంపీలు లేఖ రాశారు. తెలంగాణ కాంగ్రెసు ఎన్నికల కమిటీ నుండి రేణుకా చౌదరిని తొలగించాలని వారు తమ లేఖలో కోరారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని కించపరిచేలా రేణుక గతంలో మాట్లాడారని వారు లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు తాము ఇరవై స్థానాల నుండి పోటీ చేస్తామని, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తుపై చర్చిస్తున్నట్లు చాడ వెంకటరెడ్డి చెప్పారు.