స్టేజ్పై డిగ్గీ, సుబ్బిరామిరెడ్డి కునుకు, 'వైయస్ నాకు స్నేహితుడు'
విశాఖ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, టి సుబ్బిరామి రెడ్డిలు గురువారం నాడు స్టేజి పైనే నిద్రపోయారు. గురువారం విశాఖలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఓ కునుకు తీశారు.
ఓ వైపు పార్టీ నాయకులు సీరియస్గా మాట్లాడుతున్న సమయంలో వారు కునుకు తీయడం గమనార్హం. చంద్రబాబు, మోడీ పాలన పైన, ఇచ్చిన హామీల పైన, ప్రత్యేక హోదా, ప్రజా సమస్యల పైన నేతలు మాట్లాతున్నారు. ఆ సమయంలో వీరి కునికుపాట్లు పడటం పార్టీ నేతలనే విస్మయానికి గురి చేసిందంటున్నారు.
అందరూ ఓకే అన్నారు: విభజనపై డిగ్గీ, వైయస్సార్ ఇష్యూ.. జగన్పై ఫైర్
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బొక్కబోర్లా పడిన విషయం తెలిసిందే. ఒక్క అసెంబ్లీ, ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అయితే, ఏపీలో అధికార పార్టీ ప్రజలకు ఏం చేయడం లేదని, మరోవైపు, ప్రతిపక్ష వైసిపి విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో తాము ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని, 2019 నాటికి ఎన్నికల్లో తామే గెలుస్తామంటున్నారు.
కాగా, అంతకుముందు డిగ్గీ మాట్లాడుతూ.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో తనకు మంచి స్నేహ సంబంధం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, వైయస్ రాజశేఖర రెడ్డికి సంబంధం లేదని చెప్పేందుకు వైసిపి ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు.