మండలిలో గందరగోళం..ఉత్కంఠ: రూల్ 71పై చర్చకు టీడీపీ పట్టు: మంత్రుల సీరియస్..!
ఏపీ శాసన మండలిలో ఉదయం నుండి ప్రతష్ఠంభన కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానులు..సీఆర్డీఏ బిల్లు శాసనసభలో ఆమోదం పొందటంతో..ఈ రోజు మండలిలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. అదే విధంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే బిల్లులు ప్రవేశ పెట్టేందుకు సిద్దమైంది. అదే సమయంలో టీడీపీ పక్ష నేత యనమల తాము ముందుగా ఇచ్చిన రూల్ 71 పై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేసారు.
దీనికి మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో..రెండు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే కారణంగా సభ నాలుగు సార్లు వాయిదా పడింది. ఇక దశలో ఛైర్మన్ టీడీపీ ఇచ్చిన రూల్ 71పైన చర్చకు అనుమతించారు. సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ చర్చ ప్రారంభించారు. ఆ సమయంలో మంత్రులు..వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ఛైర్మన్ తీరు పైన అసహనం వ్యక్తం చేసారు. రెండు పక్షాల నుండి పోటీ పోటీగా నినాదాలు కొనసాగుతుండటంతో..ఇప్పటి వరకు సభలో బిల్లులు ప్రవేవ పెట్టకుండానే..సభ అయిదో సారి వాయిదా పడింది.
రూల్ 71పైన చర్చకు అనుమతి..
ఉదయం నుండి నాలుగు సార్లు వాయిదా పడిన మండలి నాలుగు గంటల విరామం తరువాత తిరిగి సమావేశమైంది. ఆ సమయంలో తాను ఉదయం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రూల్ 71పైన చర్చ కొన సాగించాలని సూచించారు. అయితే, మంత్రి బుగ్గన అభ్యంతరం వ్యక్తం చేసారు. బిల్లులను పరిగణలోకి తీసుకున్నట్లుగా పరిగణించి..71 పైన చర్చ చేపట్టాలని సూచించారు. దీనికి టీడీపీ పక్ష నేత యనమల అభ్యంతరం వ్యక్తం చేసారు. ముందుగా రూల్ 71 పైనే చర్చ జరగాలని..ఆ తరువాత బిల్లులను ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేసారు.
మంత్రుల అసహనం..
సభలో జరుగుతున్న పరిణామాల మీద మంత్రులు అసహనం వ్యక్తం చేసారు. ఛైర్మన్ రాజకీయ కోణంలో పని చేయకూడదంటూ మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు. కావాలంటే బిల్లులను తిరస్కరించాలని.. బిల్లులను అడ్డుకోవడం తగదని మంత్రి బొత్సా సూచించారు. అదే సమయంలో సభలోని ఇతర ఎమ్మెల్సీల అభిప్రాయాలను ఛైర్మన్ స్వీకరించారు.
చిన్న చిన్న టెక్నికల్ పాయింట్లపై సభను స్ధంభింప చేయడం సరి కాదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం సూచించారు. ముందుగా బిల్లులను కన్సిడర్ చేసి.. ఆ తర్వాత రూల్ 71 నోటీసుపై చర్చించాలని సూచించారు. మండలి ఛైర్మన్ రూలింగ్ ఇచ్చి ముందుకెళ్లాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సూచన చేసారు. ఏమైనా సభను ఇన్ని సార్లు స్టాల్ చేయడం సరికాదని మాధవ్ వ్యాఖ్యానించారు. తాము అన్ని రకాలుగా సహకరిస్తున్నా..ఈ విధంగా మండలి ఛైర్మనుగా ఈ విధంగా వ్యవహరించడం సరికాదని..టీడీపీ ఏం చెబితే అదే చేస్తామనడం సరైన విధానామా అంటూ బొత్సా ప్రశ్నించారు.
భారీగా మార్షల్స్ మొహరింపు...
టీడీపీ రాజ్యాంగ సంక్షోభం సృష్టించే ప్రయత్నం చేస్తోందని మంత్రి బుగ్గన ఆరోపించారు. టీడీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందంటూ.. సీట్లల్లో నుంచి టీడీపీ తీరుపై మంత్రులు నిరసన వ్యక్తం చేసారు. మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో బుద్దా వెంకన్న...మాట్లాడటంతో..మండలి ఛైర్మన్ వద్దకు టీడీపీ సభ్యులు చెవిలో గుస గుసలాడడం కరెక్టేనా అని మంత్రి బొత్సా ప్రశ్నించారు. టీడీపీ చెప్పినట్టు మండలి ఛైర్మన్ చేయడం కరెక్ట్ కాదన్న బొత్స ముందుగా ప్రభుత్వ బిజినెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సభలో రెండు పక్షాల సభ్యులు పోడియం వద్దకు నినాదాలు చేస్తుండంతో..మండలి వద్ద భారీగా మార్షల్స్ ను మొహరించారు. ఛైర్మన్ ఎంత చెప్పినా రెండు పక్షాల నేతలు నినాదాలు ఆపకపోవటంతో సభను మరో సారి పది నిమిషాలు వాయిదా వేసారు.