బిజెపిలోకి దినేష్రెడ్డి, టిక్కెట్: తెరాసలోకి బాబు మోహన్
బిజెపి, టిడిపిల మధ్య పొత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఒంగోలు లోకసభ అభ్యర్థిగా టిడిపి ఇప్పటి వరకు ఎవరిని ప్రకటించ లేదు. దీంతో టిడిపి హామీతో బిజెపి తరఫున పోటీ చేయాలని దినేష్ రెడ్డి భావిస్తున్నారంటున్నారు.
ఇందుకు సంబంధించి ఆయన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో ఫోన్లో మాట్లాడారని, అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్తానని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒంగోలు నుండి పోటీకి బిజెపి నేతల నుండి స్పష్టమైన హామీ రాగానే ఆయన అధికారికంగా ఆ పార్టీలో చేరే అవకాశముంది.
తెరాసలోకి బాబు మోహన్
సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బాబు మోహన్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఈ మేరకు తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఈ రోజు సాయంత్రం భేటీ కానున్నారు. ఈ నెల 26న అధికారికంగా సైకిల్ దిగి కారెక్కనున్నారని తెలుస్తోంది. అతనికి కెసిఆర్ ఆందోల్ టిక్కెట్ కేటాయించనున్నారు. మరోవైపు జగన్కు షాకిస్తూ తెరాసలో చేరనున్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి నిర్మల్ లేదా నిజామాబాద్ రూరల్ టిక్కెట్ ఇచ్చే అవకాశముంది.