దర్శకుడు రాఘవేంద్రరావు సంచలనం - టీడీపీ అధికారంలోకి ఖాయం : కొనసాగించండి..!!
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేసారు. రెండేళ్లలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రోజురోజుకూ ప్రజల్లో తెదేపాకు ఆదరణ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారం చేపట్టడం తథ్యమని జోస్యం చెప్పారు. టీడీపీ కార్యకర్తలు ఇదే ఉత్సాహం కొనసాగించాలని సూచించారు. రాఘవేంద్రరావు తొలి నుంచి టీడీపీకి అనుకూలంగానే ఉన్నారు.
టీడీపీ ఎన్నికల ప్రచారం కోసం గతంలో ప్రకటనలకు సైతం దర్శకత్వం వహించారు. అదే విధంగా రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆయను టీటీడీలో ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా నియమించింది. అప్పటికే టీటీడీ బోర్డు ఛైర్మన్ గా ఆయన పేరు ప్రచారం జరిగినా.. ఎస్వీబీసీ అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇక, జగన్ సీఎం అయిన తరువాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అంశాల పైన మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పలువురు ప్రముఖులు కలిసి చర్చలు చేసారు. అందులో దగ్గుబాటి సురేష్.. రాజమౌళి వంటి వారు ఉన్నారు.
సినిమా టిక్కెట్ల వ్యవహారం పైన జరిగిన చర్చల్లోనూ పలువురు నిర్మాతలు..తరువాత హీరోలు మహేష్ బాబు.. ప్రభాస్ వంటి వారు చిరంజీవితో కలిసి సీఎంను కలిసారు. కానీ, ఆ చర్చల్లో సినీ ఇండస్ట్రీలో ప్రముఖులైన రాఘవేంద్ర రావు సీఎం ను కలిసేందుకు ముందుకు రాలేదు. అదే సమయంలో ప్రభుత్వం పైనా ఎటువంటి విమర్శలు చేయలేదు. ఎన్టీఆర్ హయాం నుంచి నందమూరి కుటుంబంతో సత్సంబంధాలు కలిగిన రాఘవేంద్ర రావు ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక, రెండేళ్లలో చంద్రబాబు అధికారం చేపట్టటం ఖాయమంటూ రాఘవేంద్ర రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా సినీ వర్గాల్లోనూ ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.