విద్యుత్ బిల్లు మోగనుంది!: రూ.3.72 వరకు పెంపు
తమకున్న నష్టాలన్నీ పూడ్చుకొని ప్రతీ యూనిట్పై కనీసం ఐదు పైసల లాభం వచ్చేలా ఛార్జీలను పెంచాలని డిస్కంలు కోరాయి. త్వరగా ప్రతిపాదనలు పంపాలని సర్కారు కూడా తొందరపెట్టడంతో కన్సల్టెంట్ల సహకారంతో లెక్కలు కట్టి గతేడాది కంటే రెట్టింపు విద్యుత్ చార్జీలను ప్రతిపాదిస్తూ బంతిని ఈఆర్సీ కోర్టులోకి బుధవారం నాడు నెట్టేశాయి.
డీజిల్, పెట్రోలు, వంటగ్యాస్, నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడిని విద్యుత్ చార్జీల పెంపు కోలుకోలేని దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది. సగటు జీవికి విసనకర్రలు, కిరోసిన్ బుడ్డిలే దిక్కయ్యేలా డిస్కంలు వ్యవహరిస్తున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 2.54 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులుంటే ఉచిత విద్యుత్ పరిధిలోకి వచ్చే 30 లక్షల మంది రైతులను మాత్రం వదిలిపెట్టి మిగిలిన అన్ని వర్గాలకూ దిమ్మదిరిగేలా చార్జీలను పెంచడానికి డిస్కంలు ప్రతిపాదించాయి. కనిష్ఠంగా 50 పైసలు, గరిష్ఠంగా 3.72 రూపాయల వరకు పెంచాలని ఈఆర్సిని కోరాయి.