పొత్తులు తెచ్చిన తంటా: కాంగ్రెస్ పై అలిగిన మెగాస్టార్... త్వరలోనే పార్టీకి చిరంజీవి రాజీనామా?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది మరోసారి నిరూపితమైంది. ఉత్తర్ప్రదేశ్లో బద్ధ శత్రువులైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు ఒకే తాటిపైకి రావడంతో ఇది ఒకసారి నిరూపితం కాగా... తాజాగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న పరిస్థితుల నుంచి భాయి భాయి అని పిలుచుకునే పరిస్థితి వరకు రావడంతో మరోసారి నిరూపితమైంది.
అయితే కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని చాలామంది కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ మంత్రులు వట్టి వసంత కుమార్, సీ రామచంద్రయ్యలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా అదే బాటలో నడిచే యోచనలో కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమాలతో బిజీ అయిపోయిన మెగాస్టార్
కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్కు రాజీనామా చేసే యోచనలో ఉన్నారా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం ఎదుర్కొన్న తర్వాత చిరంజీవి సినిమాలతో బిజీ అయిపోయారు. అంతేకాదు రాజ్యసభ సభ్యుడిగా కూడా చాలా అరుదుగా సభలకు హాజరయ్యేవారు. ఇక రాజ్యసభ పదవీకాలం పూర్తయ్యాక యాక్టివ్ పాలటిక్స్కు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి ఉంటే మచ్చుకైనా చిరంజీవి పేరు వినిపించడంలేదు. చిరంజీవి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్గా నిలుస్తారని కొద్దిరోజులుగా వార్తలు వచ్చినప్పటికీ... ఆ స్థానాన్ని రాములమ్మ విజయశాంతి కొట్టేశారు.
కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై అలిగిన చిరంజీవి
సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇక రాజకీయాలకు పూర్తిగా దూరమవుతారనే టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై చిరంజీవి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు టీడీపీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని సన్నిహితుల వద్ద ప్రశ్నించినట్లు తెలుస్తోంది. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ద్వారా విలువలకు తిలోదకాలిచ్చేసిందని చిరు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. నవంబర్ 1న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించగానే చిరంజీవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని... కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే రాజీనామా చేస్తారని దీనిపై మరికొన్ని రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తారని చిరు కుటుంబ సభ్యులు తెలిపారు.
చిరంజీవి రాజీనామా అంశం నావరకు రాలేదు: రఘువీరా
ఇదిలా ఉంటే కాంగ్రెస్కు చిరంజీవి రాజీనామా అంశాన్ని ఏపీ పీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డిని ప్రశ్నించగా ఈ అంశంపై చిరంజీవి తనతో ప్రస్తావించలేదని చెప్పారు. ఒక నెల క్రితం తనతో మాట్లాడినప్పుడు కాంగ్రెస్లోనే తను ఉంటానని చిరంజీవి చెప్పినట్లు రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. ఉంటే కాంగ్రెస్లోనే ఉంటానని చిరంజీవి చెప్పారని లేదంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను తప్ప మరో పార్టీలో చేరిది లేదంటూ చిరు చెప్పినట్లు రఘువీరా వివరించారు.
తమ్ముడి కోసం అన్నయ్య ముందుకొస్తారా..?
మరోవైపు మెగాస్టార్ కుటుంబ సభ్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన బాబాయ్ కోసం ప్రచారం చేస్తానని ఇదివరకే ప్రకటించారు. ఇక జనసేనాని ప్రచారానికి రమ్మని పిలిస్తే ఈ తరం మెగా ఫ్యామిలీకి చెందిన యువ హీరోలైన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్లాంటి వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నాడు అన్న చిరంజీవి స్థాపించిన పార్టీ ప్రజారాజ్యం పార్టీని భుజాన వేసుకుని అన్నీ తానై చూసుకున్న పవన్ కళ్యాణ్, నేడు సొంతంగా జనసేనను ఏర్పాటు చేసి ఒంటరిగా ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే తమ్ముడి కోసం అన్నయ్య కదిలి వస్తారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.