Disha case encounter: అందుకే ఎన్కౌంటర్ చేయగలిగారు: ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున తమపై దాడి చేసి పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపి హతమార్చిన విషయం తెలిసిందే. దిశపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
disha case encounter: చట్టం తన పని తాను చేసింది: ఎన్ కౌంటర్పై సీపీ సజ్జనార్ కీలక విషయాల వెల్లడి
వారి అండదండలు లేని కారణంగానే..
కాగా, ఈ ఎన్కౌంటర్ ఘటనపై ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశపై హత్యాచారానికి పాల్పడిన నిందితులందరూ సామాన్యులే కాబట్టి.. పోలీసులు ఎన్కౌంటర్ చేయగలిగారని వ్యాఖ్యానించారు. ఎలాంటి రాజకీయ నాయకుల అండదండలు లేకపోవడంతో నిందితులను సులభంగా కాల్చి చంపేశారన్నారు.
కుమార్తె కేసులో వారి వల్లే..
నిందితుల ఎన్కౌంటర్తో దిశ తల్లిదండ్రులకు న్యాయం జరిగిందని చెప్పారు శంషాద్ బేగం. కానీ, పన్నేండళ్ల క్రితం అత్యాచారం, హత్యకు గురైన తన కుమార్తెకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయేషా హత్య కేసులో రాజకీయ నేతల ప్రమేయం వల్లే న్యాయం జరగలేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
సజ్జనార్ లాంటి వాళ్లుంటే..
హత్యకు గురైన తన కుమార్తె విషయంలో ఇప్పటికీ న్యాయం జరగలేదని శంషాద్ బేగం వాపోయారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా ప్రత్యక చట్టాలు తేవాలన్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ లాంటి పోలీసు అధికారి తమ కుమార్తె కేసు దర్యాప్తు చేసివుంటే తమకు న్యాయం జరిగి ఉండేదేమోనని ఆమె అభిప్రాయపడ్డారు.
కలకలం రేపిన అయేషా ఘటన..
దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై శంషాద్ బేగం సీపీ సజ్జనార్కు కృతజ్ఞతలు తెలిపారు. తన కుమార్తెపై దారుణానికి పాల్పడిన నిందితులకు రాజకీయ అండ ఉండటంతో వారు తప్పించుకున్నారని ఆరోపించారు. కాగా, 2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఉమెన్ హాస్టల్లో ఉంటూ బీ ఫార్మసీ చేస్తున్న ఆయేషా మీరాను ఆ హాస్టల్లోనే అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
Recommended Video
దిశ నిందితులను కాల్చేశారు
కాగా, దిశను అత్యారం చేసి, హత్య చేసిన కేసులో నిందితులు మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివను శుక్రవారం తెల్లవారుజామున దిశ హత్య జరిగిన చటాన్పల్లి బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లారు పోలీసులు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన సెల్ఫోన్, వాచీ, పవర్ బ్యాంక్ పాతిపెట్టిన ప్రదేశాలను చూపించారు.
ఈ సమయంలోనే నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడి చేశారు. అంతేగాక, పోలీసుల దగ్గర్నుంచి తుపాకీలను లాక్కున్నారు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు. లొంగిపోవాలంటూ పోలీసులు కోరినప్పటికీ నిందితులు వినకుండా కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి నలుగురు నిందితులను మట్టుబెట్టారు. నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఓ ఎస్ఐ, కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వారు హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు వివరాలను సీపీ సజ్జనార్ శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలియజేశారు.