disha murder case:కంటికి కన్ను, పంటికి కన్ను, నిందితులను కఠినంగా శిక్షించాలి:కేఏ పాల్
దిశ హత్యపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. కంటికి కన్ను, పంటికి పన్ను అని బైబిల్ చెప్పిందని పాల్ హాట్ కామెంట్స్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అయితే లైంగికదాడుల గురించి కొందరు రాజకీయ నేతల ప్రసంగాలు సరికాదని పాల్ అభిప్రాయపడ్డారు.
దిశ హత్య కేసు నిందితులను కోర్టుల పేరుతో తిప్పకూడదని కేఏ పాల్ అన్నారు. వారికి తక్షణమే శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. లైంగికదాడులకు పాల్పడే నీచులకు ఎవరూ మద్దతివ్వకూడదని కోరారు. వారిని పశువులతో పోల్చి వాటిని తక్కువ చేయొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా చర్చానీయాంశమై నిర్భయ హత్య కేసు దోషులకు ఇంతవరకు ఉరి శిక్ష ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. సీరియస్ నెస్ ఉన్న కేసులకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయడంతో శిక్షలు త్వరగా విధించొచ్చని అభిప్రాయపడ్డారు. లైంగికదాడులపై కొందరు నేతల కామెంట్లను మాత్రం ఖండించారు. అయేషా మీరాను ఎవరు మట్టుబెట్టారు ఇంతవరకు తేల్చలేదని పాల్ గుర్తుచేశారు. నేరస్తులను కఠినంగా శిక్షించాలే తప్ప.. తప్పించుకోకూడదని అభిప్రాయపడ్డారు.
దిశ లైంగికదాడి హత్య కేసును విచారించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. దిశ హత్య కేసు విచారించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరింది. ప్రభుత్వ లేఖపై హైకోర్టు స్పందించింది. కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్టు బుధవారం స్పష్టంచేసింది. మహబూబ్ నగర్ మేజిస్ట్రేట్ ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు.