ప్రతి జిల్లాలోనూ దిశా ప్రత్యేక కోర్టు .. 7 నుండి అందుబాటులో దిశ యాప్
Recommended Video
ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టం దిశ చట్టం 2019. ఈ చట్టాన్ని అమలు చెయ్యటానికి ఏపీ సర్కార్ ప్రత్యేక అధికారులను నియమించిన విషయం తెలిసిందే . ఇక ఈ క్రమంలో పకడ్బందీగా దిశ చట్టాన్ని అమలు చేయడానికి జిల్లాకుఒక దిశ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చెయ్యనున్నట్టు పేర్కొన్నారు. అంతే కాదు సత్వర న్యాయం కోసం,చట్టం అమలు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ చట్టం పరిరక్షణ ప్రత్యేకాధికారి కృతికా శుక్లా తెలిపారు.
జిల్లాకో ప్రత్యేక కోర్టు తో పాటు ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు
జిల్లాకో ప్రత్యేక కోర్టు తో పాటు ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చెయ్యనున్నారు. బోధనాస్పత్రుల్లో వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు సంబంధించి త్వరగా మెడికల్ సహాయం అందించేలా చూస్తామని చెప్పారు.బాధితురాలు ఆస్పత్రిలో చేరిన ఆరు గంటల్లోనే వైద్య నివేదికలు వచ్చేలా చూస్తామని చెప్పారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఆస్పత్రుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమన్వయ సమావేశంలో ముఖ్యంగా దిశ చట్టం అమలు గురించి అధికారులతో చర్చించారు.
21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా చట్టం అమలుకు చర్యలు
రోజురోజుకీ పెరిగిపోతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసే పనిలో ఏపీ సర్కార్ పని చేస్తుందని ఆమె పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా ఈ చట్టాన్ని రూపొందించిన నేపధ్యంలో చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.చట్టం అమలుకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనతోపాటు సిబ్బంది నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారని ఆమె వెల్లడించారు.
ఫోరెన్సిక్ ల్యాబ్, కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు
ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చెయ్యనున్నట్టు వెల్లడించారు . అంతే కాదు సిబ్బందిని కూడా నియమిస్తామని కృతికా శుక్లా తెలిపారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి బాధితులకు తక్షణ సహాయం అందేలా చూస్తామని చెప్పారు.సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జనవరి నెలను దిశ మాసంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ నెలాఖరు నాటికల్లా దిశ చట్టం అమలులోకి వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈనెల 7 నుంచి దిశ యాప్... చిన్నారులకు పాఠశాల స్థాయి నుండే సెల్ఫ్ డిఫెన్స్
ఇక ఈనెల 7 నుంచి ‘దిశ యాప్'ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, కాల్ సెంటర్ కూడా ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు . మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఈ చట్టం నిర్భయ చట్టం కంటే ఎంతో పటిష్టమైనదని ఆమె చెప్పారు. దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించాల్సి ఉందని చెప్పిన కృతికా శుక్లా చిన్నారులకు పాఠశాల స్థాయి నుండే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తామని వెల్లడించారు ,