జేసీ తీరుతో.. డాక్టర్లను వేడుకుంటూ ఏడ్చాడు: అనారోగ్యం అన్నా.. ఎందుకీ పంతం?
ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రిలో కీలక నేతగా ఉన్న పైలా నరసింహయ్యకు ఏళ్లుగా వైరం కొనసాగుతోంది.
అనంతపురం: వివాదాలతో సహవాసం చేసే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. ప్రత్యర్థుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆఖరికి ఆసుపత్రిలో ఉన్నారన్న కనికరం కూడా లేకుండా.. వారి చికిత్సకు అడ్డుపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పైలా నరసింహయ్య విషయంలో జేసీ వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రిలో కీలక నేతగా ఉన్న పైలా నరసింహయ్యకు ఏళ్లుగా వైరం కొనసాగుతోంది. గత నెల 15న పైలా నరసింహయ్య జేసీ వర్గీయుల్లో ఒకరిపై దాడి చేసినట్లు తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా లాభం లేకపోవడంతో.. ఈ నెల 21న పైలా లొంగిపోయారు.
లొంగిపోయిన సమయంలో పైలా అనారోగ్యంతో ఉండటంతో.. కోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిమిత్తం తొలుత తాడిపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో.. ఇదే నెల 22న అనంతపురం సర్వజనా ఆసుపత్రికి తరలించారు. గుండె స్పందన సరిగా లేకపోవడంతో పాటు అపెండిసైటిస్ లక్షణాలపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో.. హైదరాబాద్ లోని నిమ్స్కు తరలించాలని చూశారు.
విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. సర్వజనాసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జగన్నాథ్ కు ఫోన్ చేసి నిమ్స్ కు పంపించవద్దని ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. దీంతో పైలాను నిమ్స్ కు తరలించడం విరమించుకున్నారు. 'డాక్టర్లు, జేసీ వైఖరితో పైలా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆర్ఎంఓ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు'. అనారోగ్య లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని చెబుతున్నా.. ఎందుకు నిమ్స్ కు తరలించడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు దీనిపై స్పందించిన సూపరిండెంట్ జగన్నాథం మాత్రం.. జేసీని నిమ్స్ కు రిఫర్ చేయలేదని చెప్పడం గమనార్హం.