ధర్మాన చేరిక ఎఫెక్ట్: జగన్పార్టీకి ఇద్దరు మాజీలు గుడ్బై
శ్రీకాకుళం: మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు చేరిక ప్రభావం శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కనిపించింది. ధర్మానను చేర్చుకున్నందును నిరసనగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు ఇద్దరు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. వారు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కణితి విశ్వనాథం, హనుమంతు అప్పయ్యదొరలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.
కాశీబుగ్గలో కణితి, అప్పయ్యదొరలు ఆత్మగౌరవ సభను నిర్వహించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. అసెంబ్లీలో గానీ, పార్లమెంటులో గానీ ధర్మాన మోహం చూడనని చెప్పిన జగన్... ఇప్పుడు ఆయనను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. ఏ పార్టీలో చేరేదీ వారం రోజుల్లో స్పష్టం చేస్తామన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట, పలాస అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టు కణితి విశ్వనాథం ప్రకటించారు.
ఇటీవలి వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర మండలి సభ్యుడిగా, పలాస నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించిన విశ్వనాథం గత కొంతకాలం నుంచి అధిష్ఠాన నిర్ణయాపై నిరసనగళం వినిపిస్తూ వచ్చారు. అప్పయ్యదొర కూడా ఈయనకు వంతపాడారు. విశ్వనాథం 1989 నుంచి 1996 వరకు రెండు పర్యాయాలు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి ఏడేళ్ళు సేవలందించారు.
అప్పయ్యదొర పార్లమెంటు సభ్యునిగా నాలుగేళ్లపాటు పని చేశారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టిడిపి తరపున బరిలో దిగి సీనియర్ పార్లమెంటేరియన్ బొడ్డేపల్లి రాజగోపాల రావును ఓడించారు. అలాగే టెక్కలి అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల్లో కూడా టిడిపి తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2004-09 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు.
కాగా, వీరికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుండి పోటాపోటీ ఆహ్వానం ఉందని తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి.. కణితి విశ్వనాథం, అప్పయ్యదొరలతో భేటి అయ్యారు. మరోవైపు టిడిపి జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు కూడా ఇరువురు ఎంపిలను కలిశారు.