కేశవరెడ్డికి బెయిల్ నిరాకరించిన జిల్లా కోర్టు
కర్నూలు: కేశవరెడ్డి విద్యాసంస్థల అధిపతి కేశవరెడ్డికి జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది. కేసు దర్యాప్తు పూర్తి కాకపోవడంతో జిల్లా కోర్టు మంగళవారంనాడు ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. కేశవరెడ్డి విద్యాసంస్థల్లో సీఐడీ అధికారులు ఇటీవల సోదాలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో రికార్డులను అధికారులు పరిశీలించారు.
తిరుపతిలో 6, చిత్తూరులో 2, కడపలో 3, శ్రీకాకుళంలో 3 బ్రాంచీల్లో ఉన్న రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. కేశవ రెడ్డిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన పైన అయిదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రవికృష్ణ అప్పట్లో చెప్పారు. 11వేల మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. 800 మంది ప్రయివేటు వ్యక్తుల నుంచి కూడా డబ్బులు సేకరించారన్నారు.
రూ.547 కోట్ల డిపాజిట్లు సేకరించి మోసం చేశాడని తెలిపారు. పాఠశాలల ఆస్తులను తాకట్టి పెట్టి కూడా వివిధ బ్యాంకుల్లో రూ.62 కోట్ల రుణం తీసుకున్నట్లు ఎస్పీ రవికృష్ణ చెప్పారు. కేశవ రెడ్డి పైన పాణ్యం, నంద్యాల పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయి ఉన్నట్లు చెప్పారు. అతని పైన ఏపీసీ సెక్షన్లు 420, 403, 109, 149 కింద కేసులు పెట్టినట్లు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.470 కోట్లు తీసుకున్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు డిపాజిట్ కడితే పదో తరగతి వరకు ఉచితంగా చదివిస్తామని చెప్పి ఆ డబ్బు వసూలు చేసినట్లు చెప్పారు.
పదో తరగతి అయ్యాక ఆ డిపిజిట్లను తిరిగి చెల్లిస్తామని చెప్పాడని ఎస్పీ తెలిపారు. ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో కేశవ రెడ్డి పేరుతో విద్యాసంస్థలు నడుపుతున్న ఆయన పైన అనేక ఫిర్యాదులు అందాయి.
తమ సంస్థల స్కూళ్లు, కాలేజీల్లో జాయినింగ్ సమయంలో విద్యార్థుల నుంచి లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల వరకు డిపాజిట్లు సేకరించారు. ఆ డిపాజిట్ల సొమ్ము రూ.700 నుంచి రూ.800 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ మొత్తంలో భాకీ పడ్డారని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో మూడు సెంటర్లలోని మదనపల్లిలో రూ.12 కోట్లు, చిత్తూరులో రూ.4 కోట్లు, తిరుపతి బ్రాంచిలోను పెద్ద మొత్తం ఉన్నట్లుగా తెలుస్తోంది.