కల్తీరాయుళ్లకు జిల్లా బహిష్కరణ:కృష్ణా జిల్లా కలెక్టర్ నిర్ణయం...సర్వత్రా అభినందనలు
విజయవాడ:ఆహార పదార్థాల కల్తీకి పాల్పడే వారి పట్ల ఇక మీదట అత్యంత కఠినంగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. అంతేకాదు కల్తీ రాయుళ్లను జిల్లా నుంచి బహిష్కరించాలంటూ ఆయన అదేశాలు జారీ చేశారు.
ఇటీవల మీడియాలో వరుసగా వస్తున్న "కల్తీ" కథనాల పట్ల ఆయన స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా విజయవాడలో వివిధ రకాలుగా టీ పొడిని కల్తీ చేస్తున్న వైనం, అందులో కలుపుతున్న రంగులు, పరీక్షల్లో తేలిన అంశాలు, ఆరోగ్యంపై చూపే ప్రభావంపై మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన జిల్లా సహాయ ఆహార నియంత్రణ అధికారి పూర్ణచంద్రరావుతో మాట్లాడారు. వివిధ రకాలుగా టీ పొడిని కల్తీ చేస్తున్న వారిని ఉపేక్షించొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
దీనిపై తక్షణమే స్పందించిన ఆహార తనిఖీ అధికారులు ఆ ఏజెన్సీ యజమానిపై క్రిమినల్ కేసుల కోసం చర్యలు తీసుకోవాలని భవానీపురం పోలీస్స్టేషన్లో లేఖ అందజేశారు. మరోవైపు కల్తీరాయుళ్లపై జిల్లా బహిష్కరణ వేటు వేయాలన్న కలెక్టర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇటీవల ఇవి అవీ కాకుండా అన్ని వస్తువులు కల్తీలు, నకిలీలు తయారవుతుండటంపై ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాజధాని జిల్లాలు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ బెడద మరింత ఎక్కువగా ఉంది.
ఈ రెండు జిల్లాల్లో కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా చెలరేగిపోతున్నారు కల్తీరాయుళ్లు...పాలు, నెయ్యి, నూనె, మందులు, ఇంజన్ ఆయిల్స్ ఇవే కాదు ఏకంగా కండోమ్స్ సైతం నకిలీవి తయారుచేస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం ఎంతో సబబని, అంతేకాకుండా కనీసం కొంతమంది కల్తీరాయుళ్లపైనైనా ఈ బహిష్కరణ వేటు పడితేనే వారిలో కనీసం మార్పు వచ్చే అవకాశం ఉందని ప్రజాసంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.