నన్ను ఎలిమినేట్ చేయాలనే ఏపీ మంత్రి పెద్దిరెడ్డి కుట్ర: జడ్జి రామకృష్ణ సంచలనం
చిత్తూరు: తన కుమారుడ్ని కిడ్నాప్ చేశారంటూ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు జడ్జి రామకృష్ణ. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి తనపై కక్ష గట్టారని అన్నారు. ఆయనపై న్యాయ పోరాటం చేస్తున్న తనను అడ్డు తొలగించుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.
ఏపీలో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ ... హైదరాబాద్ లో చికిత్స
నా కుమారుడు అదృశ్యం: జడ్జి
మదనపల్లె నుంచి తిరుపతి ఆస్పత్రికి వస్తున్న తనను కొందరు వెంబడించారని, చివరకు తిరుపతిలో పోలీసులు తన కుమారుడిని కిడ్నాప్ చేసి వారి వాహనంలో ఎక్కించుకుని నగదు, ఫోన్ లాక్కున్నారని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో తిరుపతి టీఎంఆర్ సర్కిల్ వద్ద తన కుమారుడు కనిపించడం లేదంటూ ఆయన ఆందోళన చేశారు. అక్కడకు చేరుకున్న మీడియాతో ఆయన మాట్లాడారు.
ఓ వాహనం వెంబడించింది..
ఈఎన్టీ సమస్యతో మదనపల్లె నుంచి తిరుపతి ఆస్పత్రికి తన కుమారుడు వంశీకృష్ణతో కలిసి కారులో బయలుదేరినట్లు తెలిపారు. కాగా, భాకరాపేట నుంచి ఓ కారు తమను వెంబడించిందని, తాము కారి ఆపితే ఆ కారు కూడా ఆగిందని తెలిపారు. దీంతో తమ కారును వేగంగా తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలిపారు. తిరుపతికి చేరుకుని ఆస్పత్రికి సమీపంలో తాను దిగి ఓపీ తీసుకోవడానికి వెళ్లినట్లు తెలిపారు. కారు పార్క్ చేసిరమ్మని తన కుమారుడికి చెప్పినట్లు తెలిపారు.
Recommended Video
నా ఫోన్ ఎస్సై ఎత్తుకెళ్లారు: జడ్జి
అయితే, కారు పార్క్ చేసి ఎంతకీ రాకపోవడంతో ఫోన్ చేశానని, స్పందన రాకపోవడంతో ఆందోళనకు గురైనట్లు తెలిపారు. వెంటనే ఆటోలో గాలించడంతో టీఎంఆర్ సర్కిల్లో తమ కారు ఆగి ఉందని, అయితే, అందులో తమ కుమారుడు లేడని చెప్పారు. అక్కడి సంఘటనలపై ఫొటోలు తీస్తుంటే ఓ ఎస్సై వచ్చి తన సెల్ఫోన్ లాక్కున్నారని తెలిపారు. ఆ తర్వాత ఓ పోలీసు వాహనం నుంచి నా కుమారుడు దిగాడని, అతడ్ని పోలీసులు జీపులో ఎక్కించుకుని నగదు, ఫోన్ లాక్కున్నారని జడ్జి చెప్పారు.
పోలీసులు, ప్రైవేటు వ్యక్తుల కుట్ర.. వెనుక మంత్రి పెద్దిరెడ్డి
పోలీసులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు కలిసి తనపై ఇలాంటి కుట్ర పన్నారని చెప్పారు. ఎస్పీకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పినట్లు జడ్జి తెలిపారు. ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారని, దీనిపై తనకు ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. మంత్రిపై హైకోర్టులో కేసు వేశాననే కక్షతోనే ఈ కుట్ర పన్నారని జడ్జి ఆరోపించారు. తనన ఎలిమినేట్ చేయడానికే ఈ కుట్ర పన్నారని తెలిపారు. పబ్లిక్ ప్లేస్ కాబట్టి తాము క్షేమంగా బయటపడ్డామని, ఇదే ఘటన ఊరు బయట జరిగివుంటే తాము మనుషులుగాదొరికివుండేవాళ్లము కాదని అన్నారు.