మళ్లీ తెరపైకి దివీస్ ఉద్యమం- వైసీపీ, టీడీపీ పిల్లిమొగ్గలు- తూర్పుతీరంలో ఆందోళనలు
తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తొండగి మండలంలో ఉన్న దివీస్ లేబరేటరీస్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ ఫార్మా సంస్ధ విస్తరణ కోసం కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలను స్ధానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. విపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు సమర్ధిస్తోంది. అలాగే అధికారంలో ఉన్నప్పుడు సమర్ధించిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. దీంతో వైసీపీ, టీడీపీ డబుల్ గేమ్పై స్ధానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం దివీస్ ఫార్మాకు మద్దతుగా చేస్తున్న చర్యలను వ్యతిరేకిస్తామని ప్రకటించారు.
దివీస్ కొత్త యూనిట్..
దేశీయ దిగ్గజ ఫార్మా సంస్ధల్లో ఒకటైన దివీస్ లాబొరేటరీస్ తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి వద్ద తమ మూడో యూనిట్ను ప్రారంభిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. గతంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి తొండంగి వద్ద రూ.1500 కోట్ల వ్యయంతో కొత్త యూనిట్ నిర్మాణానికి సిద్దమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, విశాఖపట్నం సమీపంలోనూ యూనిట్లు నడుపుతున్న దివీస్ ఫార్మా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో ఈ ప్రతిష్టాత్మక యూనిట్ నిర్మాణానికి పావులు కదుపుతోంది.
మళ్లీ దివీస్ పోరు ప్రారంభం...
తూర్పుగోదావరి జిల్లాలోని తీర ప్రాంతానికి సమీపంగా ఉన్న తొండగి మండలంలో దివీస్ ఫార్మా యూనిట్ ఏర్పాటు వల్ల ఇక్కడి ప్రాంతాలు కాలుష్యంగా మారతాయని ఇక్కడి ప్రజలు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నారు. ఇక్కడ దివీస్ యూనిట్ ఏర్పాటు వల్ల సముద్ర జలాలు కలుషితంగా మారి మత్సకారులు జీవనోపాధి కోల్పోతారనే ఆందోళనలు ఉన్నాయి. దీంతో స్ధానికులు అక్కడి రాజకీయ పార్టీలతో కలిసి ఆందోళనలకు దిగుతున్నారు. వీరికి కమ్యూనిస్టులు మద్దతు పలుకుతున్నారు. ఫార్మా సంస్ద ఏర్పాటు కోసం జరిగే భూసేకరణతో పాటు ఇతర అంశాలు స్ధానికుల్లో భయాందోళనలు నింపుతున్నాయి.
వైసీపీ, టీడీపీ పిల్లిమొగ్గలు..
గతంలో విపక్షంగా ఉండగా ఎట్టి పరిస్ధితుల్లోనూ దివీస్ ఫార్మా ఏర్పాటు కాకుండా చూస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు అధికారంలోకి రాగానే దానికి మద్దతిస్తోంది. అలాగే గతంలో అధికారంలో ఉండగా దివీస్ ఫార్మా ఏర్పాటును సమర్ధించిన టీడీపీ ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతోంది. ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదనలు చేస్తున్న నేపథ్యంలో దివీస్ ఫార్మా ఏర్పాటు వల్ల మత్సకారుల జీవనోపాధి దెబ్బతింటోందని స్ధానికుడైన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపిస్తున్నారు. జగన్ తన బినామీల కోసమే ఇలాంటి రసాయన పరిశ్రమలను తూర్పుతీరంలో ప్రోత్సహిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాలు విరమించుకోకపోతే తర్వాతి పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.